కాంగ్రెస్ దేశానికిచ్చిన వరం ఇదీ: మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు, రాహుల్కు 'భూకంపం' కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి టీవీల్లో కనిపించాలనే తపన ఎక్కువ అన్నారు.
స్వాతంత్ర్యం ఓ కుటుంబం వల్ల రాలేదు, సిపాయిల తిరుగుబాటు కాంగ్రెస్ వల్లనా?
దేశానికి స్వాతంత్ర్యం ఒక్క కుటుంబం వల్లే రాలేదన్నారు. కాంగ్రెస్ పుట్టకముందే సిపాయిల తిరుగుబాటు పుట్టిందన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వల్లే సిపాయిల తిరుగుబాటు వచ్చిందని చెప్పుకుంటారా అని ఎద్దేవా చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీరసావర్కర్ల త్యాగాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని చెప్పారు.
దేశానికి కాంగ్రెస్ వరం ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ కాలంలో దేశాన్ని జైలుగా మార్చారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ ఆ పార్టీ ఇచ్చిన గొప్ప వరం ఎమర్జెన్సీ అన్నారు. తాను స్వాతంత్ర్యం వచ్చాక పుట్టానని, దేశం కోసమే పని చేస్తున్నానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీది అంతా కుటుంబ పాలన అన్నారు. పెద్ద నోట్ల రద్దు పైన చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించారు. నగదుతోనే అవినీతి ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తున్నారో దేశ ప్రజలందరికీ అర్థమయిందని చెప్పారు. సంపన్నులు గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని చెబితే.. కోటి ఇరవై లక్షల మంది వదులుకున్నారని ప్రధాని మోడీ చెప్పారు.
సోమవారం వచ్చిన భూకంపంపై..
భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్తర భారతంలో భూకంపం వల్ల పలుచోట్ల నష్టం జరిగిందన్నారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.