పీఎంసీ బ్యాంక్ స్కాం: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ఈడీ సమన్లు
ముంబై: శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం కేసు దర్యాప్తునకు సంబంధించి ఈ సమన్లు పంపినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాలని వర్ష రౌత్ను ఈడీ అధికారులు ఆదేశించారు. వర్ష రౌత్.. ప్రవీణ్ రౌత్ అనే మరో నిందితుడి భార్యతో లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. పీఎంసీ బ్యాంక్ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి సంజయ్ రౌత్ హిత వ్యాఖ్యలు
జాతీయ స్థాయిలో ప్రతిపక్షం బలహీనంగా ఉందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రంపై పోరాడేందుకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఒకే గొడుగు కిందకు రావాలని రౌత్ పిలుపునిచ్చారు.
బలహీన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. యూపీ అధ్యక్షుడిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యవహరిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సోనియా గాంధీ, శరద్ పవార్ జాతీయ స్థాయి నాయకులని, పవర్ నాయకత్వ సామర్థ్యం దేశానికి తెలుసని అన్నారు. అందుకే ఆయన్ని కూడా యూపీఏ అధినేతగా ప్రతిపాదించవచ్చని అన్నారు.