నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు, అయినా భయపడను: దీప
తనను హత్య చేస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీల అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధ్యక్షురాలు దీప ఆరోపించారు.
చెన్నై: తనను హత్య చేస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీల అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధ్యక్షురాలు దీప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తన మేనత్త, దివంగత సీఎం జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు తాను రాజకీయ ప్రవేశం చేశానని, తనను రాజకీయాల్లో రాకుండా అడ్డుకొనేందుకు పలువురు చేసిన యత్నాలు ఫలించలేదని దీప పేర్కొన్నారు.
దీంతో ఇప్పుడు ఏకంగా తనను హత్య చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని, వారిలో పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ అనుచరులు ఉన్నారని, వారు తనకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని దీప ఆరోపించారు.
అవినీతి నిర్మూలనే తమ ధ్యేయమని రాందాస్ చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని, పీఎంకే నేతలు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తన మేనత్తను ఆదర్శంగా తీసుకొని తాను రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమిస్తానని దీప ఆ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.