గడ్కరీ పోలవరం పర్యటన వాయిదా: ఆందోళనలో ఏపీ సర్కారు, ‘అరువుతో వేగం పెంచాలి’
ఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం డిసెంబర్ 23న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, నితిన్ గడ్కరీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఈ మేరకు ఆ శాఖ అధికారులు రాష్ట్ర జలవనరులశాఖకు మంగళవారం సమాచారం పంపారు.
డిసెంబర్ 26, 27తేదీల్లో నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశాలున్నట్లు తెలిసింది. కాగా, గడ్కరీ పర్యటన వాయిదా పడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాఫర్ డ్యామ్ నిర్మాణంపైనా కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఇరిగేషన్ శాఖ కోరుతోంది.
వేగం పెంచండి..
పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేస్తున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థకు 90 రోజుల అరువు ప్రాతిపదికన సిమెంటు, స్టీల్ సరఫరా చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ఆయా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. పనుల్లో వేగం మందగించడంతో గుత్తేదారుకు కొంత ఆర్థిక వెసలుబాటు కల్పించి పనులను వేగవంతం చేయడానికి ఆయన మంగళవారం తన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
పోలవరం పనులపై చర్చ
కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది కాబట్టి 90 రోజులపాటు అరువుపై సరఫరా చేయాలని కంపెనీల వారికి సూచించారు. ఈ అంశంపై స్టీల్ అథారిటీలో మాట్లాడి చెబుతామని స్టీల్ కంపెనీల ప్రతినిధులు చెప్పగా, సిమెంట్ వాళ్లు మాత్రం నెలరోజుల వరకే ఆగగలమని రెండురోజుల్లో తమ విధానం చెబుతామని గడ్కరీకి చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ ఇప్పుడు సరఫరా చేస్తున్న సంస్థలు ముందుకురాకపోతే ప్రత్యామ్నాయంగా వేరేసంస్థలను చూద్దామని గడ్కరీ ఏపీ అధికారులతో అన్నట్లు తెలిసింది.
పురోగతి సాధిస్తున్నాం..
సమావేశానంతరం ఈఎన్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత వారం గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అనంతరం నుంచి పనుల్లో కొంత పురోగతి ఉందని చెప్పారు. ప్రస్తుతం అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ ఏర్పాటుకోసం ఒక ప్లాంట్ తాత్కాలికంగా మూశారని, దానివల్ల పురోగతిలో కొంత ఇబ్బంది ఉంటుందన్నారు. కూలింగ్ప్లాంట్ ఏర్పాటు పూర్తయిన తర్వాత వేగం పెరుగుతుందని పేర్కొన్నారు. 27కల్లా ప్లాంట్ ఏర్పాటు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత పనులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాఫర్ డ్యాం నిర్మాణంపై చర్చ జరగలేదని తెలిపారు.
పోలవరం టెండర్ల గడువు పెంపు
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్ మట్టి తవ్వకం పనులకు సంబంధించి రూ.1489 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా పిలిచిన టెండర్ల గడువు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత గుత్తేదారు ట్రాన్స్ట్రాయ్సంస్థకు నెల రోజుల పాటు కేంద్రమంత్రి గడ్కరీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23 నాటికి ఖరారు కావాల్సిన టెండర్ల గడువును జనవరి 5వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వరకు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేసుకోవచ్చు. అదేరోజు టెక్నికల్ బిడ్ తెరిచి ఎవరు అర్హులో తేలుస్తారు. ఆ తర్వాత ఆర్థిక బిడ్ తెరుస్తారు.
రామ్ నాథ్ కోవింద్ రాక
ఇది ఇలా ఉంటే.. డిసెంబర్ 27న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న భారత ఆర్థిక సంఘం 100వ సదస్సును ప్రారంభిస్తారు. సచివాలయంలోని ‘రియల్ టైం గవర్నెన్స్'ను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫైబర్గ్రిడ్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రి పర్యటన ఒకే రోజు ఉండటంతో ఏపీ సర్కారు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.