‘10లక్షలిస్తానన్న కూతుర్ని వదల్లేదు- అందుకే అల్లుడ్ని చంపించా ’
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన పరువు హత్య ఘటనలో ప్రధాన నిందితుడు దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలు వెల్లడించాడు. తన కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని, అతడ్ని తన కూతురు వదిలేయాలని చెప్పినా వినకపోవడంతోనే ఈ హత్య చేయాల్సి వచ్చిందని నిందితుడు, ఆమె తండ్రి చెప్పాడు.
మార్చి 13న తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఉన్న ఉడుమలైపేట బజారు రోడ్డు నడచివెళుతున్న శంకర్ (21), అతడి భార్య కౌసల్యపై మోటారు బైకులపై వచ్చిన ఐదుగురు వేటకొడవళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు దుండగుల దాడిలో గాయపడిన కౌసల్య ప్రస్తుతం కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కాగా, హత్య జరిగిన మరుసటి రోజే కౌసల్య తండ్రి చిన్నసామి నిలకోట కోర్టులో లొంగిపోయాడు. చిన్నసామి కిరాయిమూకలతో హత్య చేయించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఉడుమలైపేట పోలీసుల కస్టడీలో ఉన్న చిన్నసామి తన వాంగ్మూలం ఇచ్చాడు.
తమ కుమార్తె కౌసల్య దళిత యువకుడు శంకర్ను రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి బంధువర్గంలో తన పరువుప్రతిష్టలు కోల్పోయానని, శంకర్తో కాపురం చేస్తున్న కౌసల్యను విడిచిపెట్టమని పలుమార్లు బంధువులతో రాయబారాలు జరిపినా ప్రయోజనం లేకపోయిందనీ, కుమార్తెను విడిచిపెడితే రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినా శంకర్ పట్టించుకోలేదని చిన్నసామి తెలిపారు.
భర్తను విడిచిపెట్టమని కుమార్తెకు చెప్పినా శంకర్తోనే కాపురం చేస్తానంటూ చెప్పి తమవారిని ఇంటి నుంచి తరిమికొట్టిందనీ, ఈ సంఘటనలన్నీ తమ కుటుంబీకుల మధ్య కలతలు రేపాయని, తమను చిన్న చూపు చూడసాగారన్నాడు. ఊరిలో తలెత్తుకుని తిరగలేక అవమానభారంతో క్రుంగిపోయామని చిన్నసామి తెలిపాడు.
హత్య జరగటానికి కొద్ది రోజులకు ముందు శంకర్ ఇంటికి వెళ్లి ఆ ఇద్దరు విడిపోకపోతే చంపుతామంటూ బెదిరించినా భయపడలేదనీ, తన కుమార్తె ఆ బెదిరింపులను ఏ మాత్రం ఖాతరు చేయలేదని చిన్నసామి తెలిపాడు. ఈ పరిస్థితులలోనే శంకర్ను హతమార్చి, కూతుర్ని కారులో ఇంటికి తీసుకురమ్మని, ఒక వేళ రాకపోతే ఆమెను కూడా చంపేయమని తన అనుచరు లను పురమాయించినట్టు చిన్నసామి వాంగ్మూలంలో తెలిపాడు.
తాను నడుపుతున్న ట్రావెలర్స్ సంస్థలో పనిచేస్తున్న కారు డ్రైవర్ జగదీశ్ నేతృత్వంలో హత్యకు ప్రణాళిక వేశామని, ధనరాజ్ అనే వ్యక్తిని శంకర్, కౌసల్య కదలికలపై నిఘా వేసి ఎప్పటి కప్పుడు సమాచారం అందించమని ఉడుమ లపేటకు పంపామని చెప్పాడు. చివరకు మార్చి 13వ తేదీన పరిస్థితులు అనుకూలించడంతో కిరాయి మూకలు శంకర్ను హతమా ర్చాయని తెలిపాడు.
అడ్డుపడ్డ తన కూతురు కౌసల్య పైనా కత్తులతో దాడి జరిపి పారిపోయారని చిన్నసామి వివరించాడు. చిన్నసామిని ఏడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరుపమని కోర్టు ఆదేశించటంతో పోలీసులు రెండు రోజులపాటు అతడిని విచారించారు. మరో ఐదు రోజుల విచారణ తర్వాత మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇది ఇలా ఉండగా శంకర్ హత్య కేసుతో సంబంధం ఉన్న కౌసల్య మేనమామ పాండి దురైని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జగదీశన్, మణికంఠన్, సెల్వకుమార్, మదన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కౌసల్య తండ్రి చిన్నసామి, ప్రసన్నా కోర్టులో లొంగిపోయారు.
ఈ నేపథ్యంలో హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న కౌసల్య మేనమామ పాండిదురై నిలకోటలో దాగి ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు మంగళవారం అక్కడికి వెళ్లి అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన కౌసల్య తల్లి అన్నలక్ష్మి, ధనరాజ్ పరారీ ఉన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ ఎనిమిదిని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.