విద్యార్థుల దెబ్బతో కేంద్ర మంత్రుల పర్యటన రద్దు: బీజేపీ ఆఫీస్ కు భారీ భద్రత, మెరీనా బీచ్ !
నీట్ పరీక్షలో అర్హత సాధించలేదన్న బాధతో ప్లస్ టూ (ఇంటర్) విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి.
చెన్నై: నీట్ పరీక్షలో అర్హత సాధించలేదన్న బాధతో ప్లస్ టూ (ఇంటర్) విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. దలిత విద్యార్థి అనిత శుక్రవారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శనివారం అరియలూరు జిల్లాలో పెద్ద ఎత్తు విద్యార్థులు ఆందోళనకు దిగారు. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర విద్యార్థులు గుమికూడి కేంద్ర, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు పసిగట్టారు.
విషయం తెలుసుకున్న చెన్నై నగర పోలీసులు మెరీనా బీచ్ లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళనతో తమిళనాడులో కేంద్ర మంత్రుల పర్యటనలు, వివిద కార్యక్రమాలను బీజేపీ నాయకులు శనివారం పూర్తిగా రద్దు చేసుకున్నారు.
చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అరియలూరు జిల్లాలోని అనిత ఇంటి దగ్గరకు డీఎంకే పార్టీ నాయకులు, వీసీకే అధినేత తిరుమావలన్ చేరుకుని ఆమెకు నివాళులు అర్పించారు.