బెంగళూరులో నలుగురు ఉగ్రవాదులు అరెస్టు
బెంగళూరు: బెంగళూరు నగరంలో నలుగురు ఉగ్రవాదులను ఇంటిలిజెన్స్ వర్గాలు అరెస్టు చేశాయి. గుట్టు చప్పుడు కాకుండా నిత్యం రద్దిగా ఉన్న ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నలుగురు ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారని బెంగళూరు నగర పోలీసు అధికారులు తెలిపారు.
తోనార బసుమత్రి, సంధన్ బసుమత్రి, నసీన్ బసుమత్రి, జిబాల్ నస్రరీ అనే నలుగురిని అరెస్టు చేశామని శనివారం పోలీసు అధికారులు చెప్పారు. ఈ నలుగురు అస్సాంలోని బోడో ఉగ్రవాదులు. చాల కాలం క్రితం బెంగళూరు చేరుకుని రాజగోపాల నగరలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు.
ఈ నలుగురు రాజగోపాలనగరలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరిలో పని చేస్తున్నారు. అస్సాం పోలీసులు చాల కాలం నుండి వీరి కోసం గాలిస్తున్నారు. అయితే అస్సాంలో వీరి ఆచూకి లేదు. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల సహకారంతో నలుగురు బెంగళూరులో తల దాచుకున్నారని అస్సాం పోలీసులు తెలుసుకున్నారు.
బెంగళూరు చేరుకున్న అస్సాం పోలీసులు ఐఎస్ విభాగం డీస్పీ సుబ్రమణ్యస్వామి నేతృత్వంలోని ప్రత్యేక బృందం శనివారం వేకువ జామున వీరు నివాసం ఉంటున్న ఇంటి మీద దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. బెంగళూరులో మరి కొంత మంది ఉగ్రవాదులు తల దాచుకున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.