పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ !
బెంగళూరు: వివాహం చేసుకుంటానని మహిళను మోసం చేసిన పోలీసు అధికారిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సెక్యూరిటి విభాగంలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సమీవుల్లా ఖాన్ మీద పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన మహిళ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో ఉత్తర ప్రదేశ్కు చెందిన మహిళ నివాసం ఉంటున్నారు. ఈమెకు ఇంకోకరికి ఇంటి స్థలాల విషయంలో వివాదాలు ఉన్నాయి. సిద్దరామయ్య సెక్యూరిటి విభాగంలో సమీవుల్లా ఖాన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉత్తర ప్రదేశ్ మహిళ సీఎం సిద్దరామయ్య క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన ఇంటి స్థలాల గొడవ కేసు పరిష్కారానికి సహాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
ఆ మహిళ సీఎం ఇంటి దగ్గరకు వెళ్లిన సమయంలో ఇన్స్పెక్టర్ సమీవుల్లాతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇద్దరు టచ్లో ఉన్నారు. వివాహం చేసుకుంటానని ఆమెను సీఐ సమీవుల్లా నమ్మించాడు. అప్పటి నుండి వివాహం పేరుతో తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని భాదితురాలు ఎం.ఎన్. రెడ్డికి ఫిర్యాదు చేశారు.
వివాహం చేసుకొవాలని చెబితే తనను బెదిరిస్తున్నాడని మహిళ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సమీవుల్లాను సీఎం సెక్యూరిటి వింగ్ విధుల నుండి తప్పించారు. సీఏఆర్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ డి రూపాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని బాధితురాలికి సూచించారు. సీఐ సమీవుల్లా ఖాన్ మీద విచారణ చేయించి న్యాయం చేస్తానని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి బాధితురాలికి హామి ఇచ్చారు.