కదిలొచ్చిన ఎన్ఐఏ: ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులు: పోలీస్ అధికారి అరెస్ట్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ బంగళా అంటాలియా సమీపంలో ఓ కారులో బాంబులు, పేలుడు వస్తువులు లభించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉందనే అనుమానాలతో ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను అరెస్ట్ చేసింది. సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్ఐఏ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఆయనను ఈ సమాచారాన్ని ప్రకటించారు.
పేలుడు వస్తువులను ఉంచిన స్కార్పియో కారు యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదంగా మరణించిన ఉదంతంలోనూ ప్రమేయం ఉండొచ్చనే ఆరోపణలు సచిన్ వాజేపై ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన ముఖేష్ అంబానీ బంగళా వద్ద స్కార్పియో కారులొ పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ కారును చోరీ చేశారంటూ కేసు నమోదైంది. చోరీకి గురైన కారులోనే పేలుడు వస్తువులను నింపి, అంబానీ ఇంటికి అతి సమీపంలో పార్క్ చేసి ఉంచారని పోలీసులు నిర్ధారించారు.

ఆ కారు ఎవరిదనే విషయాన్ని తేల్చారు. ఆటో స్పేర్ పార్డుల డీలర్ మన్సుఖ్ హిరేన్కు చెందినదిగా గుర్తించారు. ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడం, హిరేన్ మరణానికి సచిన్ వాజే కారణమంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసును అనూహ్య మలుపు తిప్పింది. హిరేన్ మృతిచెందిన వ్యవహారంపై ఉద్దవ్ థాకరే ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఆరోపణలను ఎదుర్కొంటోన్న సచిన్ వాజేను విధుల నుంచి తొలగించింది. చివరికి- ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారుల చేతికి చేరింది.
హిరేన్ మృతి కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న సచిన్ వాజేను శనివారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆయనపై 120 (బీ), 286, 465, 473, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేలుడు పదార్థాలతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ఇదివరకు ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు కూడా ఈ దర్యాప్తులో భాగస్వామ్యులయ్యారు.












Click it and Unblock the Notifications