పండ్లు అమ్మి.. ఆటోలు నడిపి... మారువేషాల్లో పోలీసులు
కేసుల్లో నిందితులుగా ఉండేవారిని పట్టుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తారు. మారువేషాల్లో తిరుగుతూ నిందితులు ఎక్కడున్నారనేది తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర లో పోలీసులు ఓ గొలుసు దొంగను పట్టుకున్నారు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు.. పండ్లు, కూరగాయలు విక్రయించడం.. తర్వాత దిక్కుమొక్కులేని నిరాశ్రయులుగా నటించడంతోపాటు ఆటోలు కూడా నడిపారు. చివరకు ఓ ఆటోలోనే నిందితుడిని పట్టుకొని స్టేషన్ కు తరలించారు. పాల్ఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

అంబివలీ ప్రాంతానికి చెందిన అబ్బాస్ అమ్జద్ ఇరాన్(24) అనే పాత నేరస్థుడు గొలుసు దొంగతనాల కేసులో తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడి ఆచూకీ దొరికినప్పటికీ అరెస్టు చేసే విషయంలో అతని సంబంధీకుల నుంచి దాడుల ముప్పు పొంచివుంది. గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరగడంతో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మారువేషాల్లో తిరుగుతూ ఆపరేషన్ పూర్తిచేయాలని ముందే నిర్ణయించుకున్నారు.

ఇరాన్ కోసం పండ్లు, కూరగాయలు విక్రయించారు. తర్వాత ఆటోలు నడిపారు. దిక్కు మొక్కులేనివారు తిరిగినట్లుగా రోడ్లపై తిరిగారు. రెండువారాలపాటు ఇలా నిఘా పెట్టారు. ఒంటరిగా ఉన్న సమయాన్ని ఎట్టకేలకు గుర్తించి, ఆటోలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇరానీ అరెస్టుతో జిల్లాలో ఏడు గొలుసు చోరీల కేసులు పరిష్కారమయ్యాయని, ఓ టూవీలర్ తోపాటు రూ.3.31 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అమ్జద్ ఇరాన్ పై మొత్తం 21 కేసులున్నాయి.












Click it and Unblock the Notifications