నన్నుఇరికించేందుకే: థరూర్, సునంద హత్యపై ఆధారాలని పోలీస్ బాస్
న్యూఢిల్లీ: తన సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తనను ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. తనను, తన స్టాఫ్ మెంబర్ నారయన్ను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.
శశిథరూర్ ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఓ లేఖ రాశారు. పోలీసులు తమ స్టాఫ్ను విచారించడం, వేధించడం ఆపాలని అందులో పేర్కొన్నారు. థరూర్ ఈ విషయమై పోలీసు కమిషనర్తో ఫోన్ ద్వారా మాట్లాడారని, అలాగే మెయిల్ పంపించారని వార్తలు వస్తున్నాయి.
తనను నిందితుడిగా చిత్రీకరించిందేకు తమ వద్ద పని చేసే వారిని వేధిస్తున్నారని చెప్పారు. నారాయణన్ను వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.
సునందది హత్యే అని చెప్పేందుకు కారణాలు ఉన్నాయి: ఢిల్లీ పోలీసు కమిషనర్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ది హత్యేనని చెప్పేందుకు కారణాలు లభించాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం చెప్పారు. సునంద మృతి విషయంలో విచారించేందుకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తాము హత్య కింద కేసు నమోదు చేయడానికి అందుకు తగిన ప్రాథమిక ఆధారాలు లభించడమే అన్నారు. అందుకే తాము ఇది హత్యగా భావిస్తున్నామని చెప్పారు. కాగా, అవసరమైతే ఈ కేసులో శశిథరూర్ను కూడా ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.