ప్రశాంత్ కిశోర్ ఫాలోస్ జగన్ - మద్దతు ప్రకటించిన ఆ ఎమ్మెల్సీ
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడిపించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఉపయోగపడిన ప్రణాళికలను తాను స్వయంగా అమలు చేయబోతోన్నారు.
మీ పథకాలేవీ మాకొద్దు: ఎమ్మెల్యే కేతిరెడ్డి ముఖం మీదే తేల్చిచెప్పిన ఓ సామాన్య టీడీపీ కార్యకర్త
పాదయాత్రతో..
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలతో విజయదుందుభి మోగించడానికి ప్రధాన కారణం- వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన వేసిన తొలి అడుగు 3,648 కిలోమీటర్ల దూరం సాగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆగింది. ఈ మహా పాదయాత్ర వెనుక ప్రశాంత్ కిశోర్ ఆలోచన ఉందనేది బహిరంగ రహస్యమే.
ఇప్పుడదే ప్లాన్..
ఇప్పుడదే ఆలోచనను ప్రశాంత్ కిశోర్ అమలు చేయబోతోన్నారు. తానూ పాదయాత్ర చేపట్టనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జగన్ తరహాలోనే 3,000 కిలోమీటర్ల మేర ఆయన కాలినడక నడవనున్నారు. జన్ సురాజ్ పేరుతో ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
బహిరంగ సభలు..
రాజధాని పాట్నా నుంచి ప్రశాంత్ కిశోర్ చంపారన్కు బయలుదేరి వెళ్లారు. ఈ కాన్వాయ్లో దాదాపు 500 వరకు వాహనాలు ఉన్నాయి. చంపారన్కు వెళ్లే మార్గాలన్నీ ప్రశాంత్ కిశోర్కు స్వాగతం పలికే ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. ఈ మార్గంలో ఆయన పలు చోట్ల బహిరంగ సభలను నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా స్థానికులకు విజ్ఞప్తి చేస్తోన్నారు. పాదయాత్రను విజయవంతం చేసేలా వ్యూహాలను రూపొందించుకున్నారు.
మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ
ప్రశాంత్ కిశోర్ తలపెట్టిన ఈ పాదయాత్రకు రాజకీయ వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. చాప్రాకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ సచ్చిదానంద రాయ్ బేషరతుగా తన మద్దతు ప్రకటించారు. దశలవారీగా తాను ప్రశాంత్ కిశోర్తో కలిసి పాదయాత్ర చేస్తాననీ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ప్రశాంత్ కిశోర్ ఆవిర్భవిస్తారని స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లల్లో బిహార్ను దేశంలోని మొదటి 10 రాష్ట్రాల్లో తీసుకని రావాలనే సంకల్పంతో ఆయన జన్ సురాజ్ పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు.
నితీష్కు కుడిభుజంగా..
ఇదివరకు ప్రశాంత్ కిశోర్.. బిహార్లో అధికారలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)లో కీలక పాత్ర పోషించారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్యాంప్లో కీలక నాయకుడిగా ఎదిగారు. జాతీయ పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటి విషయాల్లో నితీష్ కుమార్.. ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ బయటికి వచ్చారు. ఆ తరువాత జేడీయూ అధికారికంగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ నుంచి బయటికొచ్చింది జేడీయూ.