ఆ సీఎంపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు: జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
10 ఏళ్ల క్రితం పెమాతో సహా మరికొంతమంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. అప్పట్లో పెమా సీఎంగా లేరని, సీఎం అయ్యాక ఫిర్యాదు చేస్తే ఇప్పుడు తన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోతున్నారు.
కాగా, తనపై చేస్తున్న అత్యాచార ఆరోపణలను సీఎం పెమా ఖండు ఖండించారు. ఇదంతా ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. అనవసరంగా తనపై బురదజల్లడానికే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. తనను అనవసరంగా బద్నాం చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.
కాగా, 2008 జులైలో పేమా, మరో ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సదరు మహిళ చెబుతోంది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని, ఘటనపై ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది.
అయితే అత్యాచారం జరిగిన ఏడేళ్ల తర్వాత 2015లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఖండూ సీఎం కావడానికి కొద్ది నెలల ముందు కేసు నమోదు చేసింది. అప్పట్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆమె ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యాయవాది సాయంతో ఆమె జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించారు. కానీ, ఎన్డబ్ల్యూసీ కూడా ఆ పిటిషన్ను తోసిపుచ్చడం గమనార్హం. తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని, ఏడాది కాలంగా తనను చంపేస్తామంటూ కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.