మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. ఇక మిగిలింది తెలంగాణ, రాజస్థాన్
Recommended Video
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 12, 20 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ పూర్తవుతుంది. ఇక తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.