షాకింగ్: రైల్వే స్టేషన్ టీవీలో నీలి చిత్రం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఉండే టీవీలో ఉన్నట్లుండి నీలిచిత్రం ప్రసారం కావడం, దాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఉండే టీవీలో ఉన్నట్లుండి నీలిచిత్రం ప్రసారం కావడంతో ప్రయాణికులు అవాక్కయిన ఉదంతమిది. ప్రయాణికుల్లో కొందరు షాక్ నుంచి తేరుకుని తమ సెల్ ఫోన్లకు పనిచెప్పారు. ఇలా తన సెల్ ఫోన్ లో రికార్డు చేసిన ఓ ప్రయాణికుడు దానిని సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఉదంతం ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫారంపై ఉన్న ఓ టీవీలో ఏప్రిల్ 9న పోర్న్ వీడియో క్లిప్ ప్లే అయింది. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడు పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో షాక్ తిన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(డీఎంఆర్సీ) ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. రైల్వేస్టేషన్ లోని టీవీలో నీలిచిత్రం వస్తున్న సమయంలో దాని ముందునుంచే కొంతమంది ప్రయాణికులు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
దీంతోపాటు మరికొందరు ప్రయాణికులు కూడా తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై డీఎంఆర్సీ అధికారులను ప్రశ్నించగా, అది కమర్షియల్ యాడ్స్ కోసం ఉద్దేశించిన టీవీ అని, విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.