శ్రీ విజయపురం: పోర్ట్ బ్లెయిర్ పేరు మారింది!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ (Port Blair) పేరును మార్చింది. ఇకపై పోర్ట్ బ్లెయిర్ను శ్రీ విజయపురం (Sri Vijayapuram)గా వ్యవహరించాలని ప్రకటించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడేందుకు ఈ పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. 'వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయంపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం' అని అమిత్ షా పేర్కొన్నారు.

చరిత్రతోపాటు స్వాతంత్ర్య పోరాటంలోనూ అండమాన్ నికోబార్ దీవులది కీలక పాత్ర అని అమిత్ షా అన్నారు. చోళ సామ్రాజ్యంలో నౌకదళ స్థావరంగా ఉన్న ఈ భూభాగం.. ప్రస్తుతం మన దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆశయాలకు కీలక కేంద్రంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
మన జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఎగురవేశారని అమిత్ షా గుర్తు చేశారు. వీర్ సావర్కర్ తోపాటు అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన సెల్యూలర్ జైలు కూడా ఇక్కడే ఉందని వివరించారు.
కాగా, నికోబార్ ద్వీపం కేంద్రం ద్వారా రూ. 72,000 కోట్ల ప్రాజెక్ట్పై వార్తల్లో ఉంది. ఇది స్వదేశీ షాంపెన్ తెగను స్థానభ్రంశం చేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నికోబార్ ద్వీపంలో 244 మంది జనాభాతో షాంపెన్లు ప్రధానంగా సంచార జాతుల వేటగాళ్ళు. 2004 సునామీ తరువాత వారు ఇప్పటికే అరణ్యాలలోకి వెళ్లినందున.. షోంపెన్లు నివసించని ప్రాంతం కోసం ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడిందని స్థానిక పరిపాలన అధికారులు పేర్కొన్నారు.
అండమాన్ నికోబార్లోని 21 దీవులకు ప్రధాని మోడీ పేరు పెట్టారు. గత జనవరిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరాక్రమ్ దివస్ సందర్భంగా యూటీలోని 21 పెద్ద పేరులేని దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు . అంతకుముందు రాస్ దీవులుగా పిలిచే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications