కీలక మలుపు: పరీక్ష వాయిదా వేసేందుకే ప్రద్యుమన్ హత్య, సీనియరే హంతకుడు
Recommended Video
న్యూఢిల్లీ: రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసులో మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పరీక్ష వాయిదా వేసేందుకే చిన్నారి ప్రద్యుమన్ను సీనియర్ విద్యార్థి హత్య చేశాడని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మేరకు విద్యార్థి హత్యపై సీబీవదఐ అధికారులు బుధవారం కీలక విషయాలు వెల్లడించారు.
కీలక మలుపు..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రద్యుమన్ ను హత్య చేసిన నిందితుడు, పాఠశాలలో చదువుతున్న 11వ తరగతి విద్యార్థిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై సీబీఐ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది.
సీబీఐ అదుపులో నిందితుడు..
ప్రద్యుమన్ హత్య కేసులో నిందితుడూన సీనియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసుతో విద్యార్థికి సంబంధం ఉందని పేర్కొంది. సదరు సీనియర్ విద్యార్థి చదువులో వెనుకబడ్డాడని సీబీఐ తెలిపింది.
పరీక్ష వాయిదా కోసమే హత్య..
పరీక్షలు, పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడాలని కోరుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించింది. ఇందుకోసమే ప్రద్యుమన్ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తోంది. ప్రస్తుతం సీనియర్ విద్యార్థిని ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం సీనియర్ విద్యార్థిని జువైనల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరుతోంది. మూడురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారిస్తోంది సీబీఐ. శనివారం నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టనుంది.
కఠినంగా శిక్షించాలి
ఇది ఇలావుంటే, నిందితుడిని వయోజనుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని బాధిత బాలుడి కుటుంబం, వారి తరపు న్యాయవాది డిమాండ్ చేశారు. కాగా, మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు కండక్టర్ అశోక్ కుమార్కు ఇప్పుడే క్లీన్ చిట్ ఇవ్వలేమని సీబీఐ తెలిపింది. అతడిపై వచ్చిన ఆరోపణలను కూడా విచారిస్తున్నామని స్పష్టం చేసింది.