తుపాకీతో బెదిరించి మూడేళ్లు లైంగిక దాడి చేశారు: ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా కార్యకర్త సంచలనం
బెంగళూరు: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మరో మహిళా కార్యకర్త ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు గురిచేసి తనపై రేవణ్ణ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ హసన్కు చెందిన జేడీఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు చేశారు. దీంతోపాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫొటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు.
బాధితురాలు తన ఫిర్యాదులో 'తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని అతడి మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఎంపీ క్వార్టర్కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్నూ, నా భర్తను చంపేస్తానని బెదిరించాడు. తనకు సహకరించకపోతే.. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ హెచ్చరించాడు' అని పేర్కొంది.

పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ దుబాయ్ నుంచి జర్మనీ పారిపోయాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నా పట్టుకొస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అంతేగాక, ప్రజ్వల్ ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రజ్వల్ దేశం దాటి ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ప్రజ్వల్ దౌత్య పాస్ పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు. అలా జరిగితే అతడు విదేశాల్లో ఉండటానికి వీలుండని చెప్పుకొచ్చారు. నిందితుడ్ని పట్టుకొచ్చి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు.












Click it and Unblock the Notifications