రెండు రోజులే గడువు: చానెళ్ల బ్యాన్పై జవదేకర్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు వేదికగా ఎంఎస్వోలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను సోమవారం సాయంత్రంలోగా పునరుద్ధరించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ ప్రాంత మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్ల(ఎంఎస్వో)లకు అల్టిమేటమ్ జారీ చేశారు.
ఈలోగా రెండు చానెళ్లనూ తిరిగి ప్రసారం చేయకపోతే వారి లైసెన్సులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో స్వతంత్ర ఎంఎస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, వివిధ సంఘాలతో చర్చించిన ఆయన గత రెండు నెలలుగా ఈ చానెల్స్ను నిషేధించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా తనను తాను అదుపు చేసుకునేందుకు స్వీయ యంత్రాంగాన్ని ఏర్పర్చుకోవాలని జవదేకర్ సూచించారు. ఈ బాధ్యతను నిర్వహించని వారిపై చర్య తీసుకునేందుకు ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలున్నాయని, అందులో తాను, కేశవరావు సభ్యులుగా ఉన్నామని చెప్పారు. అయితే అది అధికారాలు లేని అద్భుతమని మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రెస్ కౌన్సిల్ ఆదేశాలను పత్రికల్లో కనీసం ప్రచురించరన్నారు. ప్రెస్ కౌన్సిల్కు ఎలాంటి అధికారాలు కల్పించాలో నిర్ణయించేందుకు కమిటీ ఉన్నదని, తాను కూడా అందులో సభ్యుడుగా ఉన్నానని చెప్పారు. ఎలక్ర్టానిక్ మీడియా కోసం బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ ఉన్నదని, అది కొంతవరకు సఫలీకృతమైందని, వినోద కార్యక్రమాల కోసం త్రిబుల్ సీ ఉన్నదని ఆయన చెప్పారు. ఈ సంస్థల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఆయా సంస్థలే ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు.
ప్రకటనల కోసం కూడా ప్రకటనల పరిశ్రమ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుందని చెప్పారు. ఈ సంస్థలన్నీ జవజీవాలతో పనిచేసేలా చూస్తామన్నారు. మీడియాలో సంచలనవాదం ఎక్కువైందని, ఇది రాజకీయాలకే పరిమితం కాదని అన్నారు. సంచలన వార్తల వల్ల ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. స్వేచ్ఛ, బాధ్యత రెండూ సమతుల్యంగా ఉంటేనే మీడియా వర్థిల్లుతుందన్నారు. ఇక సోషల్ మీడియా తమ పరిధిలోకి రాదని అది ఐటి మంత్రిత్వ శాఖ పరిధి క్రిందకువస్తుందని జవదేకర్ స్పష్టం చేశారు.