'ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రణబ్ నాపై ఈడీ దర్యాప్తు'
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వీసా సిఫారసు చేసినందుకు వివాదం నడుస్తుండగానే, లలిత్ మోడీ యూపీఏ 2 హయాంలో ఆర్ధికమంత్రిగా పనిచేసి, ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీపై కూడా ఆరోపణలు చేశారు.
అప్పటి హోం మంత్రి పి. చిదంబరం కూడా ఈ కారణంతోనే తనని హింసించాడని పేర్కొన్నారు. ఐపీఎల్కు సంబంధించి తన ప్రమేయం, తన వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలపై 2010లో ప్రణబ్ ముఖర్జీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
అప్పటి కేంద్ర మంత్రి అయిన శశిథరూర్ ఐపీఎల్ కొచ్చి ఫ్రాంజైజీని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు నేపథ్యంలో కొచ్చి ప్రాంచైజీలో తన పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకునేందుకే అప్పటి యూపీఏ ప్రభుత్వం తనపై విచారణకు ఆదేశించినట్టు లలిత్ మోడీ భావిస్తున్నాడని 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
ఒక విదేశీ వ్యాపార ప్రతినిధిగా లండన్లో ఉండేందుకు గాను యూకే అధికారాల అనుమతి కోసం ఇచ్చిన 46 పేజీల స్టేట్మెంట్లో ప్రస్తుత రాష్ట్రపతికి వ్యతిరేకంగా లలిత్ మోడీ ఈ ఆరోపణలు చేసినట్లు టైమ్స్ ఆ కథనంలో రాసింది.
కొచ్చి ప్రాంఛైజీపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించిన కొన్ని రోజులకే శశి థరూర్ను పదవి నుంచి తొలగించింది. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ (చనిపోయారు) కొచ్చి ప్రాంజైజీలో 25 శాతం ఈక్విటీ వాటాను అప్పట్లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
లలిత్ మోడీపై ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 25, 2010న ఐపీఎల్ చైర్మన్గా బీసీసీఐ అతడని తొలగించింది. అనంతరం భారత్ నుంచి లండన్కు లలిత్ మోడీ పారిపోయిన సంగతి తెలిసిందే.