మీ పనితీరు భేష్.. ఈసీకి ప్రణబ్ ముఖర్జీ ప్రశంస
సార్వత్రిక ఎన్నికల నిర్వాహణలో ఎలక్షన్ కమిషన్ తీరుపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘన విషయంలో నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం లోక్సభ ఎన్నికలు నిర్వహించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత సమర్థవంతంగా పని చేశారని మెచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసీని ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటే అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రణబ్ అన్నారు. ఎన్నికల అధికారులు విధి నిర్వాహణ సమర్థంగా వ్యవహరించినందున ప్రజాస్వామ్యం విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎలక్షన్ కమిషనర్ పదవిలో ఉన్న వ్యక్తులంతా ఎన్నికల నిర్వాహణను పటిష్టంగా చేపట్టారని ప్రణబ్ మెచ్చుకున్నారు. విమర్శకు అవకాశం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎన్నికలు నిర్వహించారని కితాబిచ్చారు.

ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో ఏకపక్షంగా వ్యవహరించిందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. వాస్తవానికి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఈసీ సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నేతలపై ఫిర్యాదులపై మొద్దు నిద్ర వీడండంటూ ఎన్నికల సంఘానికి చురకలంచింది. మరోవైపు ఈసీ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications