ప్రశాంత్ కిషోర్ సరికొత్త ఎత్తుగడ?
బిహార్ సీఎం నీతీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రిపై విమర్శల బాణాలను సంధిస్తున్న పీకే హఠాత్తుగా నితీష్ తో రెండుగంటలపాటు భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తర్వాత మీడియాతో మాట్లాడిన నితీష్ ఇది కేవలం సాధారణ భేటీ అంటూ కొట్టి పారేశారు. తనకు, పీకేకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయన్నారు. మళ్లీ పార్టీలో చేర్చుకోబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు తాను చెప్పాల్సిందేమీ లేదని, అతణ్నే అడగండన్నారు.
ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూకు సలహాదారుడిగా పనిచేయడమే కాకుండా ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అతణ్ని నితీష్ పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి పీకే బిహార్ లో 'జన్ సురాజ్' పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక పేరుమీదే ఆయన పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు.
పార్టీ నుంచి బహిష్కరించడం, ఇప్పుడు భేటీ అవడంలాంటివన్నీ నితీష్, పీకే ఆడుతున్న డ్రామంటూ బిహార్ బీజేపీ నేతలు కొట్టిపారేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీకి ఫెవికాల్ రాసుకొని కూర్చున్నారని, ఆ కంపెనీకి ప్రచారకర్తగా ఉపయోగపడతారని నాలుగు రోజుల క్రితమే పీకే వ్యాఖ్యానించారని, ఇంతలోనే మనసు మార్చుకొని నితీష్ ను కలవడం రాజకీయ వ్యూహమేనన్నారు. రానున్న ఎన్నికల్లో నితీష్ తోపాటు ఆర్జేడీని కూడా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, , ఇదంతా పీకే ఆడుతున్న ఎత్తుగడ అంటూ కొట్టిపారేశారు. పీకే నితీష్ ను కలవడంలో జేడీయూ మాజీ ఎంపీ వర్మ కీలకపాత్ర పోషించారు. జాతీయ రాజకీయాల్లో నితీష్ త్వరలోనే కీలక పాత్ర పోషించబోతున్నారని, ఆ దిశగా నితీష్ కు ఉన్న కలను నిజం చేయడానికే పీకే కలిశారంటూ వార్తలు వస్తున్నాయి.