ప్రశాంత్ కిశోర్ వర్సెస్ నితీశ్: అబద్దాలు చెప్తున్నారు, అమిత్ షాకు చెప్పాల్సింది, ధైర్యం లేదా..?
జేడీయూ అధినేత నితీశ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిశోర్ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ చీఫ్ అమిత్ షా సూచనతోనే ప్రకాంత్ కిశోర్ను జేడీయూలో చేర్చుకున్నానని నితీశ్ కుమార్ అనడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ కామెంట్లపై ప్రశాంత్ కిశోర్ కూడా అదే రేంజ్లో విరుచుకుపడ్డారు.
ఇదే కారణమా..?
జేడీయూ-ఎన్డీఏ భాగస్యామ్య పక్షంగా కొనసాగుతోంది. సీఏఏ, ఎన్ఆర్సీకి పార్టీ మద్దతు తెలిపింది. కానీ దీనిని ప్రశాంత్ కిశోర్ మాత్రం వ్యతిరేకించారు. పౌరసత్వ సవరణ చట్టం అనేది అప్రజాస్వామికం అని బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో మతపరమైన వివక్ష ఏర్పడే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు.
పవన్ వర్మ- ప్రశాంత్ కిశోర్
పార్టీలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై మంగళవారం పాట్నాలో మీడియా ప్రతినిధులు నితీశ్ కుమార్ను ప్రశ్నించారు. కొందరేమో లేఖ రాస్తున్నారు (పవన్ వర్మను ఉద్దేశించి) మరికొందరు (ప్రశాంత్ కిశోర్)ను ఉద్దేశించి ట్వీట్ చేస్తున్నారు అని పరోక్షంగా మాట్లాడారు. దీనిపై ఏం మాట్లాడాలి.. ఒకవేళ పార్టీతో ఉండాలి అనుకొంటే ఉండొచ్చు, లేదు వెళ్లాలి అనుకొంటే వెళ్లొచ్చు అని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ పార్టీలో ఎలా చేరారో తెలుసా.. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని సూచించారని పేర్కొన్నారు.
ధైర్యం లేదా..?
నితీశ్ కుమార్ కామెంట్లను ప్రశాంత్ కిశోర్ తప్పుపట్టారు. నితీశ్ అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. పార్టీలో చేరిక గురంచి అబద్దం చెప్పడం సరికాదు. మీ మనస్సులోని మాటలను ఇతరులకు ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు. మీకు ధైర్యం ఉంటే, నిజంగా అమిత్ షా సూచిస్తే.. పార్టీలో చేర్చుకోబోనని చెప్పాల్సింది అన్నారు. కానీ లేనిది కల్పించారని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. దీనిపై తాను బీహర్ వచ్చి నితీశ్ కుమార్తో మాట్లాడుతానని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ వ్యుహకర్తగా పనిచేస్తున్నారు.