ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయాలని సీఎంకు చెప్పా.. : తేల్చేసిన ప్రశాంత్ కిశోర్
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తోన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినట్టే.. ఆయన కూడా అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జన్ సురాజ్ పేరుతో తన సొంత రాష్ట్రం బిహార్లో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఈ పాదయాత్ర ప్రారభం కానుంది.

వైసీపీకి దిక్సూచి..
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడిపించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్రగా కదలి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పాట్నా నుంచి ఇప్పటికే ఆయన చంపారన్కు చేరుకున్నారు.

ఉద్దేశం ఏమిటో వెల్లడి..
ఈ 3,500 కిలోమీటర్ల జన్ సురాజ్ పాదయాత్ర ఉద్దేశం ఏమిటనేది ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. దేశంలోనే అత్యంత నిరుపేద, వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బిహార్నను మార్పును తీసుకుని రావాలనేది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ మార్పు కోసం తొలి అడుగు వేయనున్నానని చెప్పారు. ఈ మేరకు ఈ ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. 12 నుంచి 15 నెలల్లో బిహార్లోని అన్ని గ్రామాలు, పట్టణాలను పలకరించేలా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.

కీలక అంశాల ప్రస్తావన..
ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజాన్ని సమూలంగా మార్చివేసే శక్తి ఈ రెండింటికీ ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విద్యావంతుడే అయినప్పటికీ- ఆయన హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని అన్నారు. తాను చదువుకునే సమయంలో ప్రాథమిక పాఠశాలలు ఉండేవని, ఇప్పుడవి లేవని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం..
ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడేవారని, ఇప్పుడలాంటి వ్యవస్థ లేదని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థ విఫలమైతే దాని దుష్ప్రభావం రెండు-మూడు తరాలపై పడుతుందని చెప్పారు. విద్యా వ్యవస్థను మాత్రం బాగు చేయకపోతే భవిష్యత్ తరాలు నష్టపోయతాయని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అంటే ఒకట్రెండు గదులకు రంగులు వేయడం మాత్రమేనని నితీష్ కుమార్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.

అదే చెప్పా..
తాను జనతాదళ్ (యునైటెడ్)లో పని చేస్తోన్నప్పుడు నితీష్ కుమార్కు కొన్ని విలువైన సూచనలు చేశానని ప్రశాంత్ కిశోర్కు చెప్పారు. ప్రతి బ్లాక్లో మంచి పాఠశాల నిర్మించాలని చెప్పానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దర్భర స్థితిలో ఉన్న పాఠశాలలకు నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతరులు చెప్పే విషయాన్ని వినడం నితీష్ కుమార్ ఎప్పుడో మానేశారని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. ఆయన ముందు మాట్లాడటానికి ఎవరూ సాహసించలేరని చెప్పారు.

పాదయాత్రపై..
75 సంవత్సరాల్లో బిహార్లో ఈ స్థాయిలో ఎప్పుడూ పాదయాత్ర జరగలేదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర నడకన వెళ్తానని, జాతీయ రహదారులపై కాకుండా.. బ్లాకులు, పట్టణాలు, గ్రామాల గుండా సాగుతుందని వివరించారు. వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పర్యటిస్తానని, రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్న వారిని ప్రోత్సహిస్తానని చెప్పారు. ఒక్క చంపారన్ జిల్లాలోనే 35 రోజుల పాటు పాదయాత్ర చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications