ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన -నేనొక ఫెయిల్యూర్ నేతను -పోల్ వ్యూహాలకు స్వస్తి -మోదీకి అంతలేదు -ఈసీపైనా ఫైర్
''ఈ నా ట్వీట్ ను పదిలంగా దాచుకోండి.. మే 2న అందరూ దీన్ని మరోసారి చదువుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్కోరు రెండంకెలను మించదు. ఒకవేళ నా అంచనా తప్పయి, బీజేపీకి 100 ప్లస్ సీట్లొస్తే గనుక ఎన్నికల వ్యూహకర్త ప్రొఫెషన్ నుంచి నేను పూర్తిగా తప్పుకుంటాను'' అంటూ నాలుగు నెలల కిందటే ఛాలెంజ్ విసిరారు ప్రశాంత్ కిషోర్. సరిగ్గా ఆయన చెప్పినట్లుగానే బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయఢంకా మోగించి, బీజేపీ కేవలం 80 సీట్ల దగ్గరే ఆగిపోయింది. పందెంలో బీజేపీపై గెలిచినప్పటికీ ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

పీకే సంచలన ప్రకటన..
గడిచిన ఎనిమిదేళ్లుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొదలుకొని, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అతికీలకంగా వ్యవహరిస్తూ, తిరుగులేని ఎన్నికల స్ట్రాటజిస్టుగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. తన 'ఐ-పాక్' సంస్థ ద్వారా ఆయా పార్టీలకు రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో సూచనలు, ప్రచార శైలి తదితర ఐడియాలను సమకూర్చిన పీకే.. ఇక ఆ పనికి స్వస్తిపలికారు. 'ఇక నేను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోను'' అని కుండబద్దలు కొట్టారు. రాజకీ పార్టీలకు వ్యూహాలు అందించడం కోసం తాను ఏర్పాటు చేసిన 'ఐ-ప్యాక్' సంస్థను ఇకపై సహచరులే చూసుకుంటారని, స్ట్రాటజిస్టుగా తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. సరిగ్గా..

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని టీఎంసీకి వ్యూహాలు అందించడమే కాకుండా, ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోడానికి ఒక దశలో కార్యకర్త స్థాయిలోనూ పీకే ప్రకటనలు చేశారు. మోదీ, అమిత్ షాలకు పీకే నేరుగా సవాళ్లు విసిరారు. బీజేపీకి 100 సీట్లు వస్తే స్ట్రాటజిస్టుగా తప్పుకుంటానని పదేపదే గుర్తుచేశారు. చివరికి తాను అనుకున్నది సాదించినా, ఎన్నికల స్ట్రాటజిస్టు వృత్తి నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారా పీకే అందర్నీ ఆశ్చర్యపర్చారు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు 'నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం చేయాలన్నది ఆలోచిస్తా. ముందైతే ఈ ఎన్నికల వ్యూహాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ గడుపుతా..'' అని పీకే బదులిచ్చారు. కాగా

బీజేపీ ఓటమిపై పీకే షాకింగ్ విశ్లేషణ
ఎన్నికల వ్యూహకర్త వృత్తి నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన విశ్లేషణ చేశారు. ప్రధాని మోదీ, ఎన్నికల కమిషన్, అమిత్ షాలపై దాదాపు నిప్పులు చెరిగారు. ''ప్రధాని మోదీకి పాపులారిటీ ఉన్నమాట వాస్తవం. కానీ కేవలం ఆయన పాపులారిటీతోనే బీజేపీ అన్ని ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేదు. ప్రతి విడతలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని అమిత్ షా ఏ ధైర్యంతో చెప్పారో నాకు తెలీదు. ఆయన్ను ప్రశ్నించే దమ్ము మీడియాకు ఉందా? ఇక ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీ పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. ఈసీ తీరు వల్ల మా ప్రచార స్ట్రాటజీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకే జిల్లాలో నాలుగు దఫాల పోలింగ్ పెట్టడమేంటి? బెంగాల్ లోని మైనార్టీల్లో 30 శాతం మందే టీఎంసీకి ఓట్లేశారు'' అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.












Click it and Unblock the Notifications