Prashant Kishor: ఆ పదవికి రాజీనామా చేసిన ప్రశాంత్ కిశోర్... కీలక వ్యాఖ్యలు...
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితం నుంచి కాస్త విరామం తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
'ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర నుంచి కాస్త విరామం తీసుకోవాలనే నా నిర్ణయం మీకు తెలిసినదే... ఆ కారణంగా నేను మీకు ప్రిన్సిపల్ అడ్వైజర్గా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నా. ఇప్పటికైతే నా భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ... నన్ను నా విధుల్లో నుంచి రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.' అని సీఎంకు రాసిన లేఖలో ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక రాజకీయ వ్యూహకర్తగా తన ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు పీకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకూ భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఎటువంటి స్పష్టతనివ్వలేదు. అయితే ఆయన వేస్తున్న అడుగులను గమనిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలతో ఆయన వరుస భేటీలు... 2024 నాటికి బీజేపీ వ్యతిరేకత విపక్షాలన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలతో భేటీలో పీకే కాంగ్రెస్లో చేరే అంశం చర్చకు వచ్చినట్లు లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. పీకే చేరికపై రాహుల్ పార్టీ సీనియర్లతోనూ చర్చించారనే ప్రచారం జరిగింది.పీకే కాంగ్రెస్ వెలుపల ఉండి సలహాలు,సూచనలు ఇవ్వడం కంటే... పార్టీలో చేరితే బాగుంటుందని పలువురు సీనియర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు తెలిసింది.అదే సమయంలో కాంగ్రెస్లో పీకే పాత్రకు కొన్ని పరిమితులు,హద్దులు ఉండాలని సీనియర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది.
పీకే భవిష్యత్ కార్యాచరణపై అనేక ఊహాగానాలు,ప్రచారాలు తెరపైకి వస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిణామాలు మాత్రం ఆయన కాంగ్రెస్ గూటికి చేరవచ్చుననే సంకేతాలు పంపిస్తున్నాయి. అయితే ఆ సమయం,సందర్భం ఎప్పుడా అనేది వేచి చూడాలి. పీకే కాంగ్రెస్లో చేరితే పార్టీలో ఎటువంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాల్సిందే.