కాంగ్రెస్ కు షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్: సారీ.. పార్టీలో చేరలేనంటూ హ్యాండ్!!
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరాకరించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ రచించిన వ్యూహాలు మెచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా అధినేత్రి సోనియాగాంధీ ఆహ్వానించినప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరే ప్రతిపాదనను, కాంగ్రెస్ సాధికారత యాక్షన్ గ్రూప్లో బాధ్యతలను కూడా తిరస్కరించారు. ఇక ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
కాంగ్రెస్ లో చేరటం లేదని ట్విట్టర్ లో ట్వీట్ చేసిన పీకే
తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్లో, ప్రశాంత్ కిషోర్ "ఈఏజీలో భాగంగా పార్టీలో చేరడానికి మరియు ఎన్నికలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఉదారమైన ప్రతిపాదనను తాను తిరస్కరించానని వెల్లడించారు. నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా లోతుగా పాతుకుపోయిన నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి నా కంటే పార్టీకి నాయకత్వం మరియు సమష్టి సంకల్పం అవసరం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను పార్టీలో చేరినా, చేరకపోయినా అది ముఖ్యం కాదని, పార్టీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ధృవీకరించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా
ఇక ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా ధృవీకరించారు. కాంగ్రెస్తో వరుస భేటీల అనంతరం ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరేందుకు నిరాకరించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రశాంత్ కిషోర్తో ప్రెజెంటేషన్ & చర్చల తర్వాత, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేశారు. గ్రూప్లో ఆయన బాధ్యతలో భాగంగా పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అయితే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిరాకరించినట్లుగా పేర్కొన్నారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ బాధ్యతలు కూడా తాను తీసుకోలేనని చెప్పారు. కేవలం సలహాదారుడిగా కొనసాగుతానని చెప్పారన్నారు. ఆయన చేసిన కృషిని, పార్టీకి అందించిన సూచనలను తాము అభినందిస్తున్నామని రణదీప్ సూర్జేవాలా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సాధికారత యాక్షన్ గ్రూప్ 2024.. పీకే పని చేస్తారని భావించిన కాంగ్రెస్
ఇంతకుముందు, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరియు పార్టీ సాధికారత యాక్షన్ గ్రూప్ 2024లో భాగంగా పని చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల కోసం పార్టీ ప్రణాళికపై పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రజెంటేషన్పై చర్చించిన కొద్ది రోజుల తర్వాత, రాబోయే రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధికార బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. కిషోర్ అందించిన ప్రణాళికతో సహా తదుపరి సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేయడానికి పార్టీ సీనియర్ నేతల సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
పార్టీలో చేరలేనని సారీ చెప్పిన పీకే
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రత్యేక బాధ్యతలు తనకు వద్దని, మీ చట్రంలో తాను ఇమడలేనని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. వరుస పరాజయాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. ఈ నేపధ్యంలో పీకేని పార్టీలో చేర్చుకుంటే మేలు జరుగుతుందని భావించింది. కానీ ప్రశాంత్ కిషోర్ సారీ నేను కాంగ్రెస్ లో చేరలేను అని షాక్ ఇచ్చారు.