ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు -నాలుగు నెలల మౌనం వీడి నిప్పులు -నామినేటెడ్ సీఎం అంటూ
ఎన్నికల వ్యూహకర్తగా దేశం నలుమూలలా వివిధ రాష్ట్రాల్లో ఆయన సత్తా చాటుకున్నారు.. ఒక దశలో.. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడమనే ఘనత కూడా ఆయన ఖాతాలోకే వెళ్లింది.. ఇప్పుడు కూడా పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలను గెలిపించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్నారు.. కానీ.. సొంత రాష్ట్రంలో అతి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా సైలెట్ అయిపోయారు.. భారత రాజకీయాల్లో సోషల్ మీడియా వాడకాన్ని మొదలుపెట్టిన ఆయనే.. గడిచిన నాలుగు నెలలుగా ఒక్క పొస్టు కూడా పెట్టకుండా ఆశ్చర్యపర్చారు.. ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాతగానీ తన చేతికి పనిచెప్పలేకపోయారు.. అవును.. మనం మాట్లాడుతున్నది పోల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ గురించే..

నితీశ్ ప్రమాణం చేసిన వెంటనే..
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో 125 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే కూటమి పార్టీల్లో బీజేపీ 74 సీట్లతో సీనియర్ గా అవతరించగా, 43 స్థానాలతో జేడీయూ జూనియర్ స్థాయికి పరిమితం అయింది. నితీశ్ పార్టీకి సీట్లు తక్కువే అయినా, ముఖ్య పదవి మీరే(బీజేపీనే) తీసుకోవాలని వారించినా, ఇచ్చిన మాట ప్రకారం ఆయననే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రతిపాదించింది. సోమవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీహార్ సీఎంగా నితీశ్ కుమార్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులు ప్రమాణాలు చేశారు. బీహార్ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నితీశ్ కు దేశంలోని కీలక నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ సైతం నితీశ్ కు కంగ్రాట్స్ చెప్పారు. కానీ..

అలసిపోయిన.. చేవ తగ్గిన సీఎం..
ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పాపులరైన ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం పాచికలను పక్కనపెట్టేశారు. గతంలో జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన పీకే.. బీజేపీతో నితీశ్ అతిగా అంటకాగుతున్నారని బాహాటంగా విమర్శించి, పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత సొంతగా ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేసి.. బీహారీ యువతకు రాజకీయ శిక్షణలు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగించారు. ఒక దశలో పీకే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా.. హడావుడి లేకుండా ఆయన సైలెంట్ అయిపోయారు. బీహార్ ఎన్నికలపై మీడియా ఎన్ని ప్రశ్నలడిగినా పీకే మౌనంగా ఉండిపోయారు. గడిచిన నాలుగు నెలల్లో కనీసం ఒక్క ట్వీటు కూడా చేయకపోవడం గమనార్హం. సోమవారం బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం చేశాక.. ఆయన(నితీశ్) అలసిపోయిన, చేవతగ్గిన నేత అంటూ పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు..
Recommended Video

బీజేపీ నామినేటెడ్ సీఎం నితీశ్..
‘‘భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నామినేట్ చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసి బాగా అలసిపోయిన, చేవతగ్గిన నేత(నితీశ్) సారధ్యంలో బీహార్ మరికొన్ని సంవత్సరాలు పేవలమైన పాలనను చూడబోతున్నది'' అని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా అవతరలించిన బీజేపీకి సీఎం పోస్టును సాధించుకునేలా సొంత స్ట్రాటజీ అమలు చేయనుందని, అప్పటిదాకా నామమంత్రంగా నితీశ్ ను ముఖ్యమంత్రిగా చేసినా, కర్రపెత్తనమంతా కమలనాథుల చేతుల్లోనే ఉంటుందనే ఆరోపణలు, కథనాల నేపథ్యంలో పీకే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై బీజేపీ, జేడీయూలు స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications