రాష్ట్రపతి సంచలన నిర్ణయం.. నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ.. 22న ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ
ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోన్న నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసుకు సంబంధించి భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన కీచకుల్ని క్షమించడానికి ఆయన నిరాకరించారు. నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ ను శుక్రవారం తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయం చాలా గొప్పదంటూ సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఉరి తీసేస్తారా?
ఉరిశిక్ష పడిన ఖైదీలకు చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్షకు అవకాశం కల్పిస్తారని తెలిసిందే. ముఖేశ్ సింగ్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు, రాష్ట్రపతికి విడివిడిగా క్షమాభిక్ష పిటిషన్ లు పెట్టుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గురువారమే దాన్ని తిరస్కరించగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. శుక్రవారం ఉదయం ఫైలును రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి కూడా నో చెప్పడంతో నిర్భయ దోషులు శిక్ష నుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోయినట్లయింది. ఇక బ్రహ్మదేవుడొచ్చినా వాళ్ల ఉరి తీత ఆగేపరిస్థితి ఉండదు.

22నే అమలవుతుందా?
అయితే నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22నే ఉరిశిక్ష అమలవుతుందా? లేదా? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే డెత్ వారెంట్ జారీ అయిన 14 రోజుల తర్వాతే శిక్షలు అమలవుతాయి. క్షమాభిక్ష పిటిషన్ల కారణంగా నిర్భయ దోషుల్ని జనవరి 22న ఉరి తీయాలన్న కోర్టు తీర్పు తాత్కాలికంగా నిలిచిపోయింది. జనవరి 22కు ఇంకా ఐదు రోజులే గడువుంది కాబట్టి.. మరోసారి డెత్ వారెంట్ జారీ చేస్తారా? లేక పాత ఉత్తర్వులనే అమలు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ 22న కాకున్నా ఫిబ్రవరి 5 లేదా 6 తేదీల్లో మాత్రం ఉరిశిక్షలు తప్పక అమలవుతాయి.
Recommended Video

ఆ నలుగురరూ అండా సెల్ లో..
ఒక వైపు దోషులు వరుసగా క్షమాభిక్ష పిటిషన్ లు దాఖలు చేసుకుంటున్నా... తీహార్ జైలులో మాత్రం ఉరి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. నలుగురు దోషుల్ని ఇప్పటికే మూడో నంబర్ జైలుకు తరలించడంతోపాటు మానసికంగా శిక్షకు సిద్ధం చేశారు. ఆ నలుగురినీ విడివిడిగా అండా సెల్ లో ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications