రాష్ట్రపతి ఎన్నికలు2022: ఢిల్లీ వెళ్ళిన ఎన్డీఏఅభ్యర్థి ద్రౌపది ముర్ము; రేపే నామినేషన్ దాఖలు!!
రాష్ట్రపతి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగుతుండగా, అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి సర్కార్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ను ప్రతిపాదించారు. అయితే గిరిజన మహిళను బరిలోకి దింపి బిజెపి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది.
Recommended Video
ఢిల్లీ వెళ్ళిన ద్రౌపది ముర్ము... రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురువారం భువనేశ్వర్లోని ఎంసిఎల్ గెస్ట్ హౌస్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఆమె రాబోయే 2022 అధ్యక్ష ఎన్నికల కోసం శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్టు సమాచారం. ముర్ము ఈ ఉదయం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 24వ తేదీన ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూన్ 27వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.
కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ .. ద్రౌపది ముర్ముకే ఒడిస్సా సీఎం మద్దతు
ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 29 తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇక ఎన్నికలు జులై 18వ తేదీన జరగనుండగా, 21వ తేదీన లెక్కింపు చేయనున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఒడిశా ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి చేశారు. ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు తనతో చర్చించారని పట్నాయక్ వెల్లడించారు. దేశంలోనే మహిళా సాధికారతకు ముర్ము ఆదర్శంగా నిలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
గతంలోనూ ఎన్డీయే అభ్యర్థులకు నవీన్ పట్నాయక్ మద్దతు
147 సీట్ల ఒడిశా అసెంబ్లీలో, బిజెడికి 114 మంది సభ్యులు (బహిష్కరించబడిన ఒక సభ్యునితో సహా), బిజెపికి 22, కాంగ్రెస్ 9, సిపిఐ ఎం ఒకరు మరియు ఒక స్వతంత్రుడు కూడా ఉన్నారు. గతంలో జరిగిన రెండు రాష్ట్రపతి ఎన్నికల్లో (2012, 2017) కూడా పట్నాయక్ బీజేపీ ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. 2017లో ప్రధాని నుంచి పిలుపు వచ్చిన తర్వాత పట్నాయక్ ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనదని, బీజేడీ దానిని రాజకీయాలకు అతీతంగా చూస్తుందని ఆ సమయంలో ఆయన పేర్కొన్నారు.
ఏపీలోనూ బీజేపీ అభ్యర్థి ముర్ముకే మద్దతు
మరోవైపు తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ ద్వారా రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిగా నామినేట్ అయినందుకు శ్రీమతి ద్రౌపది ముర్ముకి హృదయపూర్వక అభినందనలు అని తెలియజేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పీఎం నరేంద్ర మోడీ మీరు మన దేశానికి గొప్ప రాష్ట్రపతి అవుతారని సరిగ్గానే చెప్పారన్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి తమ మద్దతును ప్రకటించారు.