రాష్ట్రపతి ఎన్నిక ఏకాభిప్రాయానికి బీజేపీ యత్నాలు: మమతా, ఖర్గేతో రాజ్నాథ్ సంప్రదింపులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయం కోసం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష పార్టీల్లోని కీలక నేతలతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్తో రాజ్నాథ్ సింగ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
అంతేగాక, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ ఆయన మాట్లాడినట్లు సమాచారం.రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించే బాధ్యతలను బీజేపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా రాజ్నాథ్కు ఇదివరకే అప్పగించిన విషయం తెలిసిందే. ఖర్గే, మమత, అఖిలేశ్ సహా మరికొందరు విపక్ష నేతలతో కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడినట్లు సమాచారం.వారంతా అభ్యర్థి ఎవరని అడిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని 17 ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమైన రోజే బీజేపీ ఈ సంప్రదింపులు జరపడం గమనార్హం. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి బీజేడీ, టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైసీపీ పార్టీల నేతలు హాజరుకాలేదు. దీంతో ఇది తమకు కలిసొచ్చే విషయమని బీజేపీ భావిస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థి విజయానికి అవసరమైన 48శాతం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు బీజేపీకి ఉన్నాయి. బీజేడీ, వైసీపీ తమకు తప్పకుండా మద్దతిస్తాయని, మరికొన్ని పార్టీలు కూడా అనుకూలంగా ఉండటంతో విజయం ఖాయమని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇతరులపై తమ ఆధిపత్యం చూపించుకోవడానికే కొందరు ప్రతిపక్ష నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుదాంశు త్రివేది ఎద్దేవా చేశారు. గోపాలకృష్ణ గాంధీ లేదా ఫరూక్ అబ్దుల్లాలను విపక్షాల అభ్యర్థిగా ప్రకటించాలని మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications