ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా వ్యాక్సిన్ల తాజా ధరలు ఇవే: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరే తక్కువ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ ధరలను నిర్ణయించింది. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసే కరోనా వ్యాక్సిన్ల ధరలను ప్రకటించింది. కోవిషీల్డ్ షాట్కు రూ. 780, కోవాగ్జిన్ టీకాకు రూ. 1410, స్పుత్నిక్ వీ డోసుకు రూ. 1145 గా ధరలను నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
వ్యాక్సిన్ డోసులపై 5 శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. అంటే కోవిషీల్డ్పై రూ. 30, కోవాగ్జిన్ రూ. 60, స్పుత్నిక్-వీపై రూ. 47 జీఎస్టీ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల ధరలను వ్యాక్సిన్ తయారీ కంపెనీలు నిర్ణయిస్తాయని, ఏవైనా మార్పులుచేర్పులు ఉంటే ముందుగా తెలియజేయడం జరుగుతుందని తెలిపింది.
ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ సర్వీసు ఛార్జీ రూ. 150కి మించి వసూలు చేయకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ల ధరల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని సూచించింది. కాగా, కోవిన్ వెబ్సైట్లలో కూడా వ్యాక్సిన్ ధరలను పొందుపర్చనున్నారు.
కాగా, జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్థవంతంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. టీకా వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించుకునే వీలు కల్పించడం జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే డోసుల ధరలను తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. టీకాలపై ఛార్జీలను కూడా వెల్లడించాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసు గరిష్టంగా రూ. 150 మాత్రమే తీసుకోవాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తనిఖీలు జరపాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం వెల్లడించింది.