బళ్లారి పరువు తీశారు, రూ. 6 వేల కోట్ల ప్యాకేజీ, సోనియా గాంధీ, సిద్దూ, మోడీ ఫైర్, అక్రమ గనులు !
బళ్లారి: బళ్లారికి రూ. 3 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సోనియా గాంధీ తరువాత ఇటువైపు కన్నెత్తి తిరిగిచూడలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. కర్ణాటక అధికారంలో ఉన్న సిద్దరామయ్య సీదారూపాయి ప్రభుత్వం ముడుపులు ఇవ్వనిదే ఎలాంటి పనులు చెయ్యదని ప్రధాని మోడీ ఆరోపించారు.
విజయనగర సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం ఉన్న హంపిలోని రాతి రథం బొమ్మను కేంద్ర ప్రభుత్వం నగదు నోట్ల మీద ముద్రించి ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, శ్రీక్రిష్ణదేవరాయలు పాలించిన ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రధాని మోడీఅన్నారు. ఇక్కడ పర్యాటక ప్రాంతాన్ని చక్కగా అభివృద్ది చెయ్యడానికి తాము ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని ప్రధాని మోడీ ఆరోపించారు.
బళ్లారి పరువు తీశారు
బళ్లారిలో లూటీ చేసే వాళ్లు ఉన్నారని, దొంగలు ఉన్నారని, నేరస్తులు ఉన్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ ప్రాంతం పరువు తీసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ స్వార్థం విజయనగర సామ్రాజ్యం పేరు ప్రతిష్టలు, బళ్లారి జిల్లా పరువు తీసిన ఆ పార్టీకి మీరు ఓటు ఎలా వేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. బళ్లారి ప్రజల మీద ప్రధాని మోడీ స్థానిక, ప్రాంతాల సెంటిమెంట్ ప్రయోగించారు.
కర్ణాటక దివాలా తీసింది
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అప్పులపాలైందని, దివాలా తీసిందని, అయితే మంత్రుల ఆదాయం పెరిగి వాళ్లు మరింత శ్రీమంతులు అయ్యారని, ఈ విషయాన్ని మీరు నేరుగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల భూములు లాక్కొని వ్యాపారం చేసుకున్న పారిశ్రామికవేత్త అశోక్ ఖేణికి సిద్దరామయ్య టిక్కెట్ ఇచ్చి మరిపోటీ చేయిస్తున్నారని, రైతులను మరింత దోచుకోవాలని చూస్తున్నారని ప్రధాని మోడీ ఎద్దేవ చేశారు.
బళ్లారికి రూ. 2,000 కోట్లు ఇచ్చాం
బళ్లారిలో జీన్స్ పరిశ్రమల అభివృద్దికి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని మోడీ అన్నారు. అయితే బీజేపీ బళ్లారికి రూ. 2,000 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి సౌలభ్యం, రింగ్ రోడ్డు ఏర్పాటు చేసిందని ప్రధాని మోడీ వివరించారు.
ఉత్తర, దక్షిణ భారతదేశం తేడా
బీజేపీ ఒనియా, బ్రాహ్మాణుల పార్టీ, ముస్లీం, దళితుల వ్యతిరేకి అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మోడీ మండిపడ్డారు. అటల్ బిహారి వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ముస్లీం అయిన అబ్దుల్ కలాంను, ఇప్పుడు దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతులను చేశామని ప్రధాని మోడీ గుర్తు చేశారు. బీజేపీ ఉత్తర భారతదేశం, దక్షిణ భాతదేశం అని తేడా చూపిస్తోందని పలువురు ఆరోపణలు చేస్తున్నారని దక్షిణ భారతదేశానికి చెందిన వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి చేశామని ప్రధాని మోడీ గుర్తు చేశారు.
బళ్లారి అక్రమ గనులు
కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యిందని, బళ్లారిలో అక్రమ గనుల వ్యవహారం జరగడానికి తాము ఎలాంటి అవకాశం ఇవ్వలేదని మోడీ అన్నారు. బళ్లారి పాదయాత్ర నాటకం ఆడిన సిద్దరాయ్య తరువాత అధికారంలోకి వచ్చి గనుల శాఖ నియమాలు పాటించలేదని ప్రధాని మోడీ ఎద్దేవ చేశారు.
మహారాష్ట్ర- కర్ణాటకకు అదే తేడా
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు ఏళ్ల తరువాత మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని కేవలం రూ. 6 వేల కోట్లతో నీటి సమస్య పరిష్కరించామని, బళ్లారి పక్కనే తుంగభద్రా నది ఉన్నా ఇక్కడ తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ ప్రశ్నించారు. బళ్లారి జిల్లాకు అన్యాయం చేసి, దేశ వ్యాప్తంగా ఈ ప్రాంతం పరువు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు తగిన బుధ్ది చెప్పాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.