సినిమాలపై అనవసర వ్యాఖ్యలు వద్దు: మోడీ
అసంబద్ధ విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ నేతలకు ప్రధానమంత్రి మోడీ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ ఈమేరకు సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొద్దిరోజులుగా దేశమంతటా పఠాన్ చిత్రంపై వివాదం కొనసాగుతోంది. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రింబవళ్లు మనమంతా కష్టపడుతున్నామని, కానీ మనలో కొందరు మనకు సంబంధంలేని అంశాలపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అదే వ్యాఖ్యలు టీవీల్లో పదే పదే ప్రసారమవుతున్నాయని, దీనివల్ల పార్టీ అభివృద్ధి అజెండా పక్కకు పోతోందన్నారు. అందుకే అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టిగా చెప్పారు. ఢిల్లీలో రెండురోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా అందరూ పనిచేయాలంటూ ఈ సందర్భంగా మోడీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ప్రధానమంత్రి ఏ సినిమా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ పఠాన్ చిత్రంపై వివాదం జరుగుతున్నవేళ మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రంపై బీజేపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాటలో అశ్లీలత ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా దీనిపై స్పందించారు. అసభ్యత ఎక్కువగా ఉన్న సీన్లను తొలగించకపోతే మధ్యప్రదేశ్ లో సినిమా విడుదలపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొనే ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేసివుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications