మోడీకి తగ్గుతున్న ప్రజాదరణ: ఫేస్బుక్ పేజిలో పెరుగుతున్న 'అన్లైక్'లు
న్యూఢిల్లీ: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్స్లో మన దేశంలో ఏ రాజకీయనాయకుడికి లేనంత ఫాలోయింగ్ ప్రధాని నరేంద్రమోడీకి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో నెమ్మదిగా మోడీ ప్రజాదరణ తగ్గుతుందని అంటున్నారు నిపుణులు.
కారణం, నిన్నటి వరకు ప్రధాని మోడీ ఫేస్బుక్ అకౌంట్కు 'లైక్'లు వెల్లువెత్తగా, ప్రస్తుతం 'అన్ లైక్' ల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొన్నటి వరకు ప్రధాని మోడీ ఫేస్ బుక్ పేజిని 2.79 కోట్ల మంది నెటిజన్లు లైక్ చేశారు. అయితే సడన్గా నెటిజన్లకు ఏమైందో గానీ అన్ లైక్ చేయడం మొదలు పెట్టారు.
ఈ నెల 7 నాటికి ఈ సంఖ్య 2.78 కోట్లకు పడిపోయింది. అంతేకాదు 'అన్ లైక్' ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద భూ సేకరణ బిల్లు, పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష వైఖరికి నిరసగా నెటిజన్లు 'అన్ లైక్'ల రూపంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై బీజేపీ వర్గాల వాదన మరోలా ఉంది. అలాంటిదేమీ లేదని, ఫేస్బుక్ చేపట్టిన క్లీన్ డ్రైవ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని బీజేపీ జాతీయ ప్రచార సెల కన్వీనర్ అరవింద్ గుప్తా చెప్పారు. 'అన్ లైక్' ల సంఖ్య పెరిగినప్పటికీ, ఫేస్ బుక్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీనే ఉన్నారని అన్నారు.