నవాజ్ పిలిస్తే.. మోడీ ఒకే: 'దాడి'పై కర్జాయ్కి థ్యాంక్స్
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానంపై తాను చాలాకాలం తర్వాత ఢిల్లీకి రావడం సంతోషాన్ని కలిగిస్తోందని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం అన్నారు. మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులతో భేటీ అనంతరం షరీఫ్ విలేకరులతో మాట్లాడారు.
మోడీని తాను మధ్యాహ్నం కలిశానని చెప్పారు. తమ మధ్య చర్చలు ఫలవతంగా ముగిశాయన్నారు. ఇరు దేశ ప్రజల ఆకాంక్ష మేరకు పాకిస్తాన్, భారత్ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నానని చెప్పారు. చాలాకాలం తర్వాత తాను భారత్ వచ్చానని, సంతోషంగా ఉందన్నారు.
మోడీ ఆహ్వానంపై భారత్ రావడం తాను చారిత్రక అవకాశంగా భావించానని చెప్పారు. భారత్, పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి తాము నాంది పలికామన్నారు. మోడీతో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. భవిష్యత్తులోని ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయని ఆశించారు. మోడీ ప్రభుత్వానికి షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు.
శాంతి, స్థిరత్వం లేకుండా ఉమ్మడి లక్ష్యాలను సాధించలేమన్నారు. ఇందుకు సఖ్యత ముఖ్యమని చెప్పారు. మోడీతో సమావేశం సుహద్బావ వాతావరణంలో జరిగిందన్నారు. భారత్, పాక్లు అపనమ్మకాలు వీడాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఉంటుందన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఫలితం ఉండదన్నారు. కాగా, మోడీని పాకిస్తాన్కు ఆహ్వానించారు. దానికి మోడీ సమ్మతించారు.
ఆఫ్ఘన్ ప్రధానికి మోడీ ధన్యవాదాలు
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భారత రాయబారంపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దానిని ఆప్ఘన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం తనను కలిసిన ఆఫ్ఘన్ ప్రధాని హమీద్ కర్జాయ్ కలిసినప్పుడు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టినందుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
మన్మోహన్ను కలిసిన మోడీ
నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి... ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చారు.