ఢిల్లీ గతి పడుతుంది, బీజేపీ గెలుపులో మా పాత్ర: మోడీకి తమ్ముడి హెచ్చరిక
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఆయన చిన్నతమ్ముడు భగ్గుమన్నారు! మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఆజాద్ మైదానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ప్రధాని మోడీ చిన్న సోదరుడు ప్రహ్లాద్ మోడీ పాల్గొన్నారు. ఆయన బీజేపీ పైన విమర్శలు గుప్పించారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో తాము ఓడిస్తామని బీజేపీని హెచ్చరించారు. ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ గుజరాత్లో ఓ చౌక ధర దుకాణం యజమాని. ఆల్ ఇండియా చౌక ధరల దుకాణ యజమానుల ఫెడరేషన్కు వైస్ ప్రెసిడెంట్.

ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకుంటే మార్చి 17న జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. ప్రసంగం ప్రారంభంలోనే ఆయన మాట్లాడుతూ... మోడీ సాహెబ్ ఆగే బడో (మోడీ సాబ్ ముందుకు వెళ్లండి) అన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను యూపీలో ఉన్నానని, బీజేపీ గెలుపు కోసం పని చేశానని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం 75,000 మంది చౌక ధర దుకాణ యజమానులు పని చేశారన్నారు. యూపీలో బీజేపీ 73 లోకసభ స్థానాలు గెలిచిందని, దాంట్లో తమ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
త్వరలో యూపీ, బీహార్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, మీరు మా మాట వినకుంటే.. ఢిల్లీలో పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. తన అన్నగా ప్రధాని మోడీని గౌరవిస్తానని, మా పోరాటం ఆయన పైన కాదని, వ్యవస్థ పైన అన్నారు.












Click it and Unblock the Notifications