మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్: అమలు చేయడమే: అమిత్ షా..!
న్యూఢిల్లీ: జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్), జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ)లపై భవిష్యత్తులో ఎలాంటి చర్చలు, సమావేశాలు ఉండబోవని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన తుది నిర్ణయలాంటిదేనని తేల్చి చెప్పారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీల మధ్య పొంతనే లేదని, ఈ రెండూ వేర్వేరుగా చేపట్టబోతున్నామని ఆయన అన్నారు. ఈ రెండింట్లో ఉన్న తేడాలను ప్రతిపక్ష పార్టీలు తెలుసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్త చర్చలకు తాము అంగీరించట్లేదంటే.. దానర్థం తాము భయపడుతున్నట్లు కాదని చెప్పారు.
ఎన్పీఆర్పై అమిత్ షా అటెన్షన్... ఎన్పీఆర్కు ఎన్ఆర్సీకి సంబంధం లేదు
ఎన్పీఆర్, ఎన్ఆర్సీ రెండూ ఒకటేననే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా రేకెత్తుతున్న విషయం తెలిసిందే. ఎన్పీఆర్ పేరుతో ప్రభుత్వం సేకరించే వ్యక్తిగత వివరాలు, ఇతర డేటాను ఎన్ఆర్సీకి బదలాయించే ప్రమాదం లేకపోలేదంటూ కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు, బీజేపీయేతర పార్టీలు అంచనా వేస్తున్నాయి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఎన్పీఆర్ ను అమలు చేయబోమని స్పష్టం చేశాయి.
ఆ అనుమానాలు, భిన్నాభిప్రాయాలప అమిత్ షా స్పందించారు. కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఎన్పీఆర్ ను అమలు చేయడానికి అంగీకరించాలని అమిత్ షా సూచించారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ కార్యక్రమాలు రెండూ ఒకటే అనే అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయని, వారిని గందరగోళంలో నెట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్పీఆర్ ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి 3,941 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని గుర్తు చేశారు. ఎన్పీఆర్ కోసం సేకరించిన వివరాలు, ఇతర డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీలో పొందుపర్చబోమని హామీ ఇచ్చారు.
ఈ రెండింటి మధ్య గల తేడాను వివరించడానికి దేశవ్యాప్తంగా చర్చలు, సమావేశాలను నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని అన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఎన్పీఆర్ ను అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. చర్చలకు వెనుకాడటం అంటే తాము పొరపాటు చేసినట్టుగా భావించ వద్దని అమిత్ షా సూచించారు ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించడానికి ఎలాంటి కార్యక్రమాన్నయినా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.