లేపేస్తాం: పోలీసులకు అల్ ఖైదా లేఖలు
చెన్నై: "మాది అల్ ఖైదా అనుబంద సంస్థ, మీరు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఖైదీల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. మీకు రోజులు దగ్గరపడ్డాయి జాగ్రత్త" అంటూ అల్ ఖైదా పేరుతో తమిళనాడులోని జైలు సూపరింటెండ్ లకు బెదిరింపు లేఖలు పంపించారు.
తమిళనాడులోని తిరుచ్చి, మధురై, వేలూరు, కోయంబత్తూరు తదితర జైళ్ల అధికారులకు ఈ బెదిరింపు లేఖలు రావడంతో వారు హడలిపోయారు. భారతదేశ అసంపూర్ణ చిత్రపటం కింద ఒసామా బిన్ లాడెన్ ఫోటో పెట్టారు. అందులో తమది అల్ ఖైదా అనుబంధ సంస్థ ది బేస్ మూమెంట్ అంటూ ముద్రించారు.
అన్ని జైళ్లకు పంపించిన బెదిరింపు లేఖలు ఒకే విధంగా ఉన్నాయి. హడలిపోయిన జైళ్ల శాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు లేఖలలో ఉన్న ఫ్రమ్ అడ్రస్ లు నకిలి అని వెలుగు చూసింది.
కోయంబత్తూరు పేళుళ్ల కేసులోని ప్రధాన నిందితులైన అల్ ఉమా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీసు ఫక్రుద్దీన్, మున్నా తదితరులు ఇటివల పుళల్ సెంట్రల్ జైలులో అధికారులు, సిబ్బంది దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కోని వారి మీద దాడి చేశారు.
బక్రీద్ పండుగ సందర్బంలో బయటనుంచి వచ్చిన ఆహారాన్ని లోపలికి అనుమతి ఇవ్వలేదని నాలుగు గంటల పాటు అధికారులపై తీవ్రవాదులు దాడి చేసి నిర్బందించారు. ఇటివల ఈ తీవ్రవాదులను పలు జైళ్లకు తరలించారు. తీవ్రవాదులను తరలించిన సెంట్రల్ జైళ్ల అధికారులకే ఇప్పుడు బెదిరింపు లేఖలు వెళ్లాయి.