లాలూప్రసాద్ కాళ్లు కడిగి, చెప్పులు మోసిన పోలీసులు!
రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పోలీసులతో కాళ్లు కడిగించుకొని, స్లిప్పర్లు మోయించినట్లుగా కథనాలు వచ్చాయి. దీనిపై జార్ఖండ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ రెండు రోజుల క్రితం బిర్సాముండా జైలు నుండి విడుదలయ్యారు.
అనంతరం ఆయన రామ్ఘర్లోని రాజ్రప్పా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సమయంలో లాలూ పాదాలను ఓ పోలీసు అధికారి(డిఎస్పీ ర్యాంక్ అధికారి) నీళ్లు పోసి కడిగారట. మరో పోలీసు లాలూ చెప్పులను చేతులతో పట్టుకొని మోశారట. ఈ కథనాలు రావడంతో విమర్శలు వస్తున్నాయి. గుడిలోకి వెళ్లే ముందు సదరు అధికారి లాలూ కాళ్లను నీటితో శుభ్రం చేశారట.
దీనిపై సదరు అధికారి స్పందిస్తూ... కాళ్లు కడుక్కునేందుకు లాలూ నీళ్లు అడగగా, తాను ఆయన పాదాల పైన పోశానని చెప్పారట. లాలూ, తాను ఒకే గ్రామం నుండి వచ్చామని, చిన్నప్పటి నుండి తనకు తెలుసునని ఆ అధికారి వివరణ ఇస్తున్నారట. అయితే యూనిఫాంలో ఉన్నప్పుడు ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
కాగా, కాళ్లు కడగడం, చెప్పులు మోయించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు బుధవారం దీనిపై విచారణకు ఆదేశించారు. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు.