భయం..భయం: రియల్ ఎస్టేట్ వ్యాపారంపై బురారీ ఆత్మహత్యల ప్రభావం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ ఆత్మహత్య ఘటనలతో చుట్టుపక్క పరిసరాల్లో నివసిస్తున్న వారిలో భయం నెలకొంది. ఆ ఇంటి ముందునుంచి వెళ్లాలంటే అక్కడి వారు భయంతో గజగజ వణికిపోతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది మరణాలు చూసి పొరుగున వేరే అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు భయపడుతున్నారు. ఇందుకోసం అక్కడివారు శాంతి పూజలు చేయిస్తున్నారు.
Recommended Video
ఆత్మహత్యకు పాల్పడ్డ లలిత్ కుటుంబం ఎదురుగా పవన్ కుమార్ త్యాగి అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆత్మహత్య ఘటన జరిగిననాటి నుంచి రాత్రివేళ తనకు తన కుటుంబ సభ్యులకు నిద్ర పట్టడం లేదని... భయంతో వణికిపోతున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే వారి ఇంట్లో పూజ చేయిస్తున్నట్లు చెప్పాడు. తను మూఢనమ్మకాలను నమ్మను అని చెబుతూనే తన కూతురు ఇంటి ముందు నుంచి కాలేజీకి వెళ్లాలంటే భయపడుతోంది అని ఆందోళన వ్యక్తం చేశాడు. పూజ చేయిస్తే ఆమెలో తిరిగి ధైర్యం వస్తుందనే నమ్మకం ఉందని పవన్ కుమార్ చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం ఇంటి నుంచి తమ ఇంటి మధ్యలో కేవలం ఖాళీగా ఉన్న భూమి మాత్రమే ఉందని గుర్తు చేశాడు పవన్. దీంతో తమ ఇంటి కిటికీ నుంచి లలిత్ ఇల్లు చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పాడు.
ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడ్డ లలిత్ కుటుంబసభ్యుల ఇల్లు ఉండే ప్రాంతంలో భూమి ధర చాలా వరకు పడిపోయినట్లు పవన్ తెలిపారు. చాలామంది మూఢనమ్మకాలతో అక్కడి స్థలాలను కొనేందుకు ముందుకు రావడం లేదని చెప్పాడు. దీంతో అక్కడి స్థలాలే కాదు... దానికి సమీపంలో ఉండే స్థలాల ధరలు కూడా పడిపోయాయని చెప్పాడు. దీంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన పవన్.