అక్కడ పీల్చేది ప్రాణవాయువు కాదు: దేశ రాజధానిలో భవన నిర్మాణాలపై నిషేధం..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొద్దిరోజులుగా ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోన్న వాయు కాలుష్యం..శుక్రవారం నాటికి డేంజర్ లెవెల్స్ ను దాటిపోయింది. దీనితో పర్యావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీనికింద దేశ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో ఎక్కడే గానీ, ఎలాంటివైనా గానీ.. నిర్మాణ పనులను చేపట్టకూడదు. నిర్మాణ రంగంపై విధించిన నిషేధం ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగుతుంది. పరిస్థితిలో మార్పు చోటు రాలేకపోతే.. నిషేధాన్ని మరి కొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
కాలుష్యం చంపేస్తుంది: ఈ రాష్ట్రాల్లో నివసిస్తుంటే ఏడేళ్ల ముందే జీవితం ఫినిష్
గ్యాస్ ఛాంబర్ లా మారిందంటూ..
ఢిల్లీ సహా పరిసర ప్రాంతాలన్నీ అత్యంత ప్రమాదకర విషవాయువులతో నిండిపోయిందని, గ్యాస్ ఛాంబర్ లా మారిపోయిందంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కాలుష్య నియంత్రణ మండలి ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి తరువాత దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం ఇదే తొలిసారి. అప్పట్లో భవన నిర్మాణ రంగంపై నిషేధం లేదు. ఈ సారి దీన్ని తాజాగా.. ఈ హెల్త్ ఎమర్జెన్సీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణ రంగ కూలీలు ఉపాధిని కోల్పోయినట్టవుతోందని అంటున్నారు.
విద్యార్థులకు మాస్కులు..
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్న నేపథ్యంలో.. అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని సంరక్షించడానికి తక్షణ చర్యలకు దిగింది. పాఠశాల విద్యార్థులకు కేజ్రీవాల్ మాస్క్ లను అందజేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న హర్యానా, పంజాబ్ లల్లో రైతులు తమ పంట వ్యర్థాలన పెద్ద ఎత్తున తగులబెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. పంట చేతికి అందిన తరువాత మిగిలిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను తగులబెడుతున్నారని, దీన్ని నియంత్రించడానికి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ..
వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది. అయినప్పటికీ.. కాలుష్య స్థాయి మాత్రం దిగిరావట్లేదు. బవానా ప్రాంతం అత్యంత కాలుష్యమయమైందని ప్రభుత్వం వెల్లడించింది. బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 497కు చేరుకుందని పేర్కొంది. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ, వజీపూర్, ఆనంద్ విహార్, వివేక్ విహార్, అలీపూర్, అయా నగర్, ద్వారకా, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం, పట్పార్ గంజ్, లోధీ రోడ్ వంటి ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. ఫలితంగా- హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీపీసీఏ) ఛైర్మన్ భూరేలాల్ వెల్లడించారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇదే దుస్థితి..
వాయు కాలుష్యం దేశ రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లను కూడా చుట్టేసింది. ఫరీదాబాద్, గుర్ గావ్, ఘజియాబాద్, నొయిడా, గ్రేటర్ నొయిడా, బహదూర్ గఢ్, భివడి, సోనేపట్, పానీపట్ లల్లోనూ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచాను కాల్చడాన్ని అధికారులు పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పెద్ద ఎత్తున జరిమానాలను విధించారు. శుక్రవారం నాటికి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని, తక్షణ నియంత్రణ చర్యలను చేపట్టకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.