రాష్ట్రమంతా అంధకారం : సీఎం ఇంటితో సహా మొత్తం చీకటి..!!
ఒక రాష్ట్రం మొత్తం అంధకారంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా విద్యుత్తు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో బీజేపీ-అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. సీఎం ఎన్.రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ఇళ్లకూ కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
నిలిచిన విద్యుత్ - ప్రజాగ్రహం
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
మొదటి రెండు రోజులు సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకున్నా.. శుక్రవారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. శనివారం పుదుచ్చేరి వ్యాప్తంగా సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్లపై చేస్తున్న ఆందోళనలతో పుదుచ్చేరి అట్టుడికిపోతోంది. ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని కలిసి.. సమస్య పరిష్కారానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
సమ్మె బాటలో ఉద్యోగులు..అంధకారం
కాగా.. విద్యుత్తు పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండబోదని పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హామీ ఇచ్చారు. విపక్షాలు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. విపక్ష ఎమ్మెల్యేలు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. పుదుచ్చేరిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులను పుదుచ్చేరికి పంపింది. శనివారం 24 మంది సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపింది.
తాత్కాలిక పునరుద్దరణ తో ఉపశమనం
వీరంతా పుదుచ్చేరి విద్యుత్తు శాఖ విశ్రాంత ఉద్యోగులను, కాంట్రాక్టర్లను పిలిపించి.. శనివారం రాత్రికల్లా విద్యుత్తు పునరుద్ధరణకు ప్రయత్నించారు. అయితే, తాత్కాలికంగా ఉపశమనం లభించింది. పదవీ విరమణ చేసిన విద్యుత్ ఉద్యోగులను ప్రభుత్వం రంగంలోకి దించింది. దసరా నవరాత్రుల నేపథ్యంలో సమ్మె సరికాదంటూ కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. అఖిలపక్ష సమావేశానికి సీఎం సిద్దమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.