పుల్వామా దాడి: 10 కి.మీ. దూరంలో ఇల్లు తీసుకొని, కారు అద్దెకు తీసుకొని.., ఐఎస్ఐ పాత్ర ఉందా?
హైదరాబాద్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలభైకి పైగా వీర జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణానికి పాల్పడన కిరాతకుడు.. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దర్. ఈ దాడి చేయడానికి కొద్ది రోజుల ముందు ఆదిల్.. పుల్వామాకు పది కిలో మీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్నాడు.
ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియో
కారును అద్దెకు తీసుకొని
పుల్వామా ప్రాంతంలో భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు కాన్వాయ్లో వెళ్తారని ముందుగా తెలుసుకున్న అదిల్ ఒక కారును అద్దెకు తీసుకుని అందులో దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలను రెడీ చేసుకున్నాడు. కాన్వాయ్ అటుగా వస్తోందని గ్రహించి తన కారుతో వేగంగా ఢీకొన్నాడు. ఇతను చదువు మానేసి ఉగ్రవాదంలో చేరాడు. దక్షిణ కాశ్మీర్లోని గూండీబాగ్ గ్రామానికి చెందిన అదిల్ చదువును మధ్యలో మానేసి ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపాడు.
గతంలో ఈ దాడులు... మూడో అతిపెద్ద దాడి
దాడి జరిగిన కొంతసేపటికే అదిల్ ఫొటోలు, వీడియోలు బయటికి విడుదల చేశారు. తన పేరు అదిల్ అని, గతేడాది జైష్ ఏ మహమ్మద్లో చేరానని, జైష్ఏ కోసం నేను చేయాల్సిన పనికి సమయం ఆసన్నమైందని, ఈ వీడియో మీకు చేరేటప్పటికే నేను స్వర్గంలో ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే. జైష్ ఏ మొహమ్మద్ పాల్పడిన అతిపెద్ద మూడో ఉగ్రదాడి ఇది అని పోలీసులు నిర్ధారించారు. గతంలో ఫర్దీన్ అహ్మద్ ఖాన్ (16), అఫాక్ అహ్మద్ షా(17)ల చేత జైష్ఏ ఇలాంటి దాడులకు పాల్పడింది. 2017 డిసెంబర్లో ఫర్దీన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. 2000లో శ్రీనగర్లోని బాదామీ బాగ్లో ఉన్న పోలీసుల హెడ్ క్వార్టర్స్ వద్ద ఓ భారీ కారు బాంబు పేలుడు సంభవించింది. ఆ దాడికి పాల్పడింది అఫాక్ అహ్మదేనని పోలీసులు గుర్తించారు ఈ దాడిలో అతనూ చనిపోయాడు.
పాక్ ఐఎస్ఐ పాత్ర ఉందా?
పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు అమెరికాకు చెందిన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఐఎస్ఐ హస్తం ఉందని అనుమానిస్తోన్న నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాల మద్దతుకు స్వస్తి పలకడానికి పాకిస్తాన్ పైన అమెరికా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని మాజీ సీఐఏ అధికారి తెలిపారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న జైష్ ఏ మొహమ్మద్ తనకు తానుగా బాధ్యత వహించడం చూస్తే ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఈ ఘటన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.