2012లో కరోనా తరహా లక్షణాలు: చైనాలో మూతపడ్డ రాగి గనిలో: పుణే సైంటిస్టుల వాదన ఇదీ
ముంబై: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తూ.. 37 లక్షల మందికి పైగా పొట్టన బెట్టుకున్న అతంత్య ప్రమాదకరమైన కరోనా వైరస్ పుట్టుక.. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబొరేటరే కారణమనడానికి మరో రుజువు వెలుగులోకి వచ్చింది. భారత్, అమెరికా సహా పలు దేశాలు చైనాను వేలెత్తి చూపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వైరస్ పుట్టుకకు తాము కారణం కాదంటూ డ్రాగన్ కంట్రీ బుకాయిస్తూ వస్తోంది.
పాఠశాల విద్యపై రాష్ట్రాలకు కేంద్రం గ్రేడింగ్: ఏపీ, తెలంగాణ స్థానాలివీ: నాడు-నేడు ఎఫెక్ట్
మూతపడ్డ రాగి గనిలో..
ఈ నేపథ్యంలో- వుహాన్లోనే వైరస్ జన్మించిందంటూ పుణేకు చెందిన సైంటిస్టు దంపతులు సైతం ధృవీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత మూత పడ్డ ఓ రాగి గనిలో, ఆ తరువాత వుహాన్ ల్యాబ్లో వైరస్ ఆవిర్భవించినట్లు నిర్ధారించారు. చైనా దక్షిణ ప్రాంతంలోని మోజియాంగ్ రాగి గనికి- వుహాన్ వైరాలజీ ల్యాబొరేటరీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని తాము గుర్తించినట్లు పుణే సైంటిస్టు దంపతులు డాక్టర్ మోనాలి రాహల్కర్, డాక్టర్ రాహుల్ బహులికర్ తెలిపారు. ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు.
2012లోనే కరోనా తరహా లక్షణాలు..
చాలా సంవత్సరాల కిందటే మూత పడిన ఈ గనిలో వేలాది గబ్బిలాలు నివసిస్తుండేవని తాము గుర్తించినట్లు చెప్పారు. గబ్బిలాల విసర్జను శుభ్రం చేయడానికి 2012లో ఆరుమంది కార్మికులు ఆ గనిలో అడుగు పెట్టారని, అదే కరోనా వైరస్ పుట్టుకుని రావడానికి కారణమైందని తాము అంచనా వేసినట్లు సైంటిస్టు దంపతులు తెలిపారు. గనిని శుభ్రం చేయడానికి వెళ్లిన ఆ ఆరుమందీ అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం కరోనా వైరస్ పేషెంట్లలో కనిపించే ప్రధాన లక్షణాలు దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటివి వారిలోనూ డాక్టర్లు గుర్తించారని వివరించారు.
గబ్బిలాల మల విసర్జన నుంచి..
గనిలో ప్రవేశించిన తరువాత.. ఎండిపోయిన గబ్బిలాల మల విసర్జనను వారు తొక్కి ఉంటారని, అది సూక్ష్మకణాలుగా మారి గాల్లోకి కలిసి.. ఆక్సిజన్ ద్వారా ఊపిరితిత్తుల్లో చేరి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ రాహల్కర్ చెప్పారు. అది క్రమంగా వైరస్గా మారి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్19 పేషెంట్లలో కనిపించే లక్షణాలు, సీటీ స్కాన్, రేడియాలాజికల్ రిపోర్టులన్నీ ఆ ఆరుమంది మోజియాంగ్ గని కార్మికుల అనారోగ్యాలను పోలి ఉన్నాయని చెప్పారు.
రీసెర్చ్ సమయంలో .. అవుట్ బ్రేక్
ఇప్పుడు కరోనా పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్టే.. ఆ ఆరుమంది గని కార్మికుల్లోనూ సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చాయని నిర్ధారించారు. చికిత్సలో భాగంగా వారికి యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మందులను వాడినట్టు తేలిందని పేర్కొన్నారు. దీన్నంతటినీ ప్రస్తావిస్తూ తాము గత ఏడాది మే లో ఓ పేపర్ పబ్లిష్ చేశామని పుణె సైంటిస్టు దంపతులు గుర్తు చేశారు. మోజియాంగ్ గనిలో పుట్టిందన్న నిర్ధారణకు వచ్చామని అన్నారు. వైద్యానికి లొంగకుండా ఆ ఆరుమంది మరణించడంపై చైనా సైంటిస్టులు వుహాన్ ల్యాబ్లో పరిశోధనలు చేసే సమయంలో అది వికటించి, అవుట్ బ్రేక్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.