బెడ్లు ఖాళీలేవు: ఆస్పత్రి వెయిటింగ్ ప్రాంతంలోనే కరోనా రోగులకు ఆక్సిజన్
పుణె: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనూ భారీగా కరోనా కేసులు కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు. ఈ క్రమంలో పుణె పింప్రిలోని ఓ ఆస్పత్రి కరోనా రోగులకు వెయిటింగ్ ఏరియాలోనే ఆక్సిజన్ అందిస్తోంది. రోగుల కోసం సుమారు ఏడు ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసింది.
యశ్వంత్ రావు చావన్ మెమోరియల్ ఆస్పత్రిలో మొత్తం 400 బెడ్లు, వీటిలో 55 ఐసీయూ ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం నాడు ఈ ఆస్పత్రిలో ఒక్క బెడ్ కూడా ఖాళీ లేకుండా పోయింది. పుణె వ్యాప్తంగా 79 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా రోగులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నవారికి వెయిటింగ్ ప్రాంతంలోనే ఆక్సిజన్ అందించినట్లు వైసీఎం ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ కౌస్తుభ్ కహానే తెలిపారు. ఆస్పత్రిలో బెడ్ ఖాళీ కాగానే లోపలికి తరలిస్తామని చెప్పారు.
ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేని కారణంగానే రోగుల పరిస్థితిని బట్టి ఇక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
पुणे में भयावह हुए हालात!
— Puja Bharadwaj (@Pbndtv) April 6, 2021
बेड फ़ुल, वेटिंग एरिया में ही लगया ऑक्सिजन बेड.
पिंपरी में YCM अस्पताल का नज़ारा,मरीज़ों की जान बचाने की कोशिश.
ज़्यादातर कोविड मरीज़ साँस की दिक़्क़त के बाद ही पहुँच रहे हैं अस्पताल.
ऑक्सिजन-ICU बेड की भारी कमी के बीच कैसे होगा नयी-बड़ी लहर से सामना? pic.twitter.com/xsFMl5RJgM
కాగా, సోమవారం పుణె జిల్లాలో 8075 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 5.8 లక్షలకు చేరింది. పింప్రి చింఛ్వాడ్ టౌన్ షిప్ లోనే 2152 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1.53లక్షలకు చేరింది. పుణెతోపాటు నాసిక్, నాగ్పూర్ లాంటి నగరాల్లో కూడా కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో పుణె కూడా ఉంది. ఈ క్రమంలోనే పుణెలో గత శుక్రవారం రాత్రి 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాలు, హోటళ్లు, బార్లు, సినిమా థియేటర్లను వారంపాటు మూసివేశారు. ఫుడ్, మెడిసిన్స్ హోండెలివరీ, ఇతర అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. పబ్లిక్ బస్సు సర్వీసులను కూడా బంద్ చేశారు. ముంబైలోనూ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వారాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు.