పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ దారుణ ఓటమి: పోటీ చేసిన రెండు చోట్లా; కాంగ్రెస్ కు షాక్!!
పంజాబ్ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నాయకుడు చరణ్జిత్ సింగ్ చన్నీ తాను పోటీ చేసిన రెండు స్థానాల నుండి ఎన్నికలలో ఓడిపోయారు . చమ్కౌర్ సాహిబ్ మరియు బదౌర్ నుండి ఎన్నికల బరిలోకి దిగిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ దారుణ ఓటమికి గురికావడం కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పాలి. ఏకంగా సీఎంగా పని చేసిన వ్యక్తి ఓటమి పాలు కావటం దేశ వ్యాప్త ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
పంజాబ్ సీఎం చన్నీని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్ల చిత్తుగా ఓడించింది. బదౌర్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లబ్ సింగ్ ఉగోకే 57,000 ఓట్లను సాధించగా, చరణ్ జిత్ చన్నీకి 23,000 ఓట్లకు పైగా ఓట్లు వచ్చాయి. మరొక సీటులో చరణ్ జిత్ సింగ్ చన్నీకి దాదాపు 50,000 ఓట్లు వచ్చాయి. అదే స్థానం నుండి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి 54,000 ఓట్లను పొందారు. దీంతో రెండు చోట్లా తీవ్రంగా కష్టపడినా ఫలితం లేకపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మంచి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ విజయం ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర పాలిత ప్రాంతం అయిన ఢిల్లీలా కాకుండా పూర్తి రాష్ట్రాన్ని నిర్వహించే మొదటి అవకాశాన్ని ఇస్తుంది. 117 స్థానాలున్న పంజాబ్ రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో 77 స్థానాలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.
Recommended Video
ఈసారి 20 స్థానాలను గెలవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే కనిపిస్తోంది. ఆప్ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందగా, శిరోమణి అకాలీదళ్ 6 సీట్లు గెలుచుకున్నట్లు సమాచారం.