పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా: ఆమ్ ఆద్మీకి సూచనలివే..
న్యూఢిల్లీ: పంజాబీయులు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చారు. ఏ మాత్రం ఊహించని విధంగా ఓడించారు. స్వయంగా ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ ఛన్నీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు.. దారుణంగా ఓటమి పాలయ్యారు. ఈ స్థాయి పరాజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఊహించి ఉండకపోవచ్చు. ఇదివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన కేప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను ఆయన తరువాత బాధ్యతలను స్వీకరించిన చరణ్జీత్ సింగ్ ఛన్నీ అధిగమించలేకపోయారని కాంగ్రెస్ చెబుతోంది.
Recommended Video
కాంగ్రెస్కు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు పంజాబీయులు. ఢిల్లీ మోడల్ ప్రభుత్వానికి జైకొట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల పట్ల ఆకర్షితులయ్యారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని విశ్వసించారు. ఫలితంగా- అక్కడ వార్ వన్సైడ్ అయింది. ఆప్- పంజాబ్ అసెంబ్లీ స్థానాలను క్వీన్ స్వీప్ చేసింది. 117 నియోజకవర్గాలు ఉన్న పంజాబ్లో 92 చోట్ల జెండా ఎగురవేసింది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ను ప్రకటించడంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ సగం విజయం సాధించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కాగా- ఘోర పరాజయం పాలవడంతో చరణ్జీత్ సింగ్ ఛన్నీ.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం ఆయన చండీగఢ్లోని రాజ్భవన్కు చేరుకున్నారు. బన్వరీలాల్ పురోహిత్ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపించాలని గవర్నర్ ఈ సందర్భంగా ఛన్నీని ఆదేశించారు.
గవర్నర్తో సమావేశం ముగిసిన అనంతరం ఛన్నీ విలేకరులతో మాట్లాడారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నామని అన్నారు. తన హయాంలో చివరి 111 రోజుల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయొద్దని సూచించారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటు పడుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. గెలిచినా, ఓడినా తాము ప్రజల వెంటే ఉంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications