పంజాబ్ నూతన సీఎం ఎంపిక బాధ్యత సోనియాకే : సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం-అమరీందర్ కు ప్రశంసలు..!!
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా తో అక్కడ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది. పార్టీ హైకమాండ్ సూచన మేరకు అమరీందర్ ఈ సాయంత్రం తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందచేసారు. ఈ రెండు నెలల కాలంలో ఢిల్లీకి మూడు సార్లు పిలిపించారని...తనను హైకమాండ్ నమ్మటం లేదేమో అనే అనుమానం ఆయన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ లోనే ప్రస్తుతం తాను ఉన్నానని.. అనుచరులతో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
అదే సమయంలో అమరీందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, ముఖ్యమంత్రి రాజీనామా తో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే అప్పగిస్తూ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. పంజాబ్లో జరిగిన సీఎల్పీ సమావేశానంతరం ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ రెండు తీర్మానాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిందని, ఈ రెండూ సీఎల్పీ సమావేశంలో ఆమోదం పొందాయని చెప్పారు.
ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని కోరడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, కొత్త సీఎం ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిందని రావత్ వివరించారు. పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. రెండో తీర్మానం గురించి వివరిస్తూ, అమరీందర్ సింగ్ను ప్రశంసిస్తూ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని అన్నారు. సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ పరిశీలకులుగా హాజరైన అజయ్ మాకెన్ మాట్లాడుతూ, సీఎల్పీ నేత గురించిన చర్చ ఏదీ సమావేశంలో జరగలేదని అన్నారు.
ఇక, రాజీనామా చేసిన అమరీందర్ సిద్దూను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేసారు. పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే, ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ జకార్ పేరు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రిగా సోనియా ఎవరిని ఖరారు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.