punjab congress manifesto:జగన్ బాటలో సర్కారీ మద్యం-లక్ష ఉద్యోగాలు, మహిళలకు నెలకు 1100
పంజాబ్ లో తొలిదశ ఎన్నికల ప్రచారం పూర్తవుతున్న చివరి క్షణాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.ఇందులో పలు కీలక హామీలు ఉన్నాయి. వాస్తవానికి పంజాబ్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని పలు హామీలపై నలుగురు కీలక నేతలు సిద్ధూ, చన్నీ, సునీల్ జాఖర్, ప్రతాబ్ బజ్వా మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషం వరకూ ఆలస్యమైంది.
ఇవాళ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రకారం పంజాబ్ లో మరోసారి అధికారమిస్తే ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే ప్రతీ మహిళకు నెలకు రూ.1100 రూపాయలు సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే మహిళల కోసం ఏడాదికి 8 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. యూనిట్ విద్యుత్తు రూ.3కే ఇస్తామని,ఇసుక ధర క్యూబిక్ఫీట్కు రూ.4గా నిర్ణయిస్తామని, నెలవారీ కేబుల్ టీవీ రేటు రూ.100గా నిర్ణయిస్తామని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, విద్యార్ధులకు ఉచిత మొబైల్ డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది.

పంజాబ్ లో మరోసారి అధికారం కట్టబెడితే మాఫియా రాజ్ ను అంతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మద్యం, ఇసుక అమ్మకాల్ని ప్రభుత్వమే కార్పోరేషన్ల ద్వారా చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇప్పటికే ఏపీలో వైసీపీ సర్కార్ ఇదే తరహాలో వీటిని నిర్వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రాధాన్యం సంతరించుకుంది. వంటనూనెల గింజలు, పప్పు ధాన్యాలు, మొక్క జొన్నను కూడా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications